పార్టీ భవిష్యత్ పైన తేల్చేసిన పవన్ : షర్మిల పార్టీకి వెల్కమ్ : జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ మార్పు వెనుక..!!
తెలంగాణలో వైఎస్ షర్మల కొత్త పార్టీ ఏర్పాటు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కొత్త పార్టీ ఎవరు పెట్టినా స్వాగతిస్తామని..వెల్ కం అంటూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాలని..అవి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనసేన గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైందంటూ కామెంట్ చేసారు. రాజకీయంగా ఒక సారి దెబ్బ తిన్నా తిరిగి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని వివరించారు.

పార్టీ నిర్మాణం సులభం కాదు..
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేలని, ఇలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో కూడుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వారిని జనసేన గుర్తించి.. ప్రోత్సాహం ఇస్తుందన్నారు. రాజకీయాలు వందల కోట్లతో నిర్మాణం చేయాల్సి రావటం కష్టంగా మారుతోందన్నారు. తను పగటి కలలు కనే వ్యక్తిని కాదన్నారు. కుటుంబ వారసత్వ రాజకీయం ఉన్నవాళ్లే కాకుండా ఇతరులు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 2007 నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. ఎదురు దెబ్బలు తిన్నా నిలబడ్డానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో పార్టీ నడిపే శక్తి లేదని పరోక్షంగా పవన్ తేల్చి చెప్పారు.

జగన్ నాడే పార్టీ వద్దని వారించారు..
ఇదే సమయంలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు పైన ఏపీ ప్రభుత్వ సలహదారుడు..జగన్ టీం కీలక సభ్యుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి స్పందించారు. తెలంగాణలో షర్మిల రాజకీయ భవిష్యత్ ను చూసుకున్నారని చెప్పారు. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు సమయంలోనే జగన్ వద్దని వారించారని వివరించారు. పొరుగు రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనేది జగన్ విధానమని సజ్జల చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రయోజనాలకు కట్టుబడి ఉంటానని షర్మల స్పష్టం చేసారని గుర్తు చేసారు. ఏపీ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేది జగన్ అభిమతమని సజ్జల స్పష్టం చేసారు.

అనుమానాలు రాకూడదనే సీఎం పర్యటన మార్పు..
ఎటువంటి అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదనే కారణంతోనే జగన్ ఇడుపులపాయ షెడ్యూల్ సాయంత్రానికి మారిందని క్లారిటీ ఇచ్చారు. పరోక్షంగా షర్మిల వస్తున్నందునే సీఎం షెడ్యూల్ మరిందని స్పష్టత ఇచ్చారు. ఇదే అంశం పైన గతంలోనే షర్మిల సైతం క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ పెట్టటం అన్నకు ఇష్టం లేదన్నారు. అయితే, తాను తెలంగాణ ప్రయోజనాల కోసం అవసరమైతే ఎవరితోనైనా కోట్లాడుతానని ప్రకటించారు. తాజాగా, ఇదే తరహాలో చేసిన ట్వీట్ సైతం రాజకీయంగా చర్చకు కారణమైంది.












Click it and Unblock the Notifications