15, 16 తేదీల్లో పవన్ కళ్యాణ్ అనంత పర్యటన: దానిపై క్లారిటీ ఇస్తారా?
హైదరాబాద్/అనంతపురం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇంతకుముందు ఆయన ఇక్కడ పర్యటించారు. ఇప్పుడు రెండోసారి పర్యటించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెల 15, 16వ తేదీల్లో పవన్ అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యల గురించి తెలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ పర్యటనలో వామపక్ష నేతలు కూడా పాల్గొంటారు.
అలాగే, అనంతపురంలో పలువురు నేతలతో కలిసి ఏర్పాటు చేయనున్న రౌండ్ టేబుల్ సమావేశంలోనూ పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అనంతపురం జిల్లాలోని తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా పవన్ చర్చించి వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.
వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో చెప్పలేదు. ఈ పర్యటనలో ఆ క్లారిటీ ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
అనంతపురం టౌన్ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారని, కాదు.. కాదు.. కదిరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. పవన్ ఇంతవరకూ నియోజకవర్గం విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
కొంత కాలం కిందట పవన్ అనంతపురం జిల్లాలో రెండు మూడు రోజుల పాటు పర్యటించారు. గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి నియోజకవర్గాల్లో పర్యటన సాగింది. ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలతో పవన్ సమావేశమయ్యారు.
ఇప్పుడు మరోసారి పవన్ అనంతపురం వెళ్తున్నారు. ఈ నెల 15వ తేదీన పవన్ అనంతపురం సభకు వస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. సీపీఐ, సీపీఎం, జనసేనల ఆధ్వర్యంలో ఈ సభ జరుగుతుందన్నారు. జనసేన తరఫున అంశం గురించి ఇంకా అధికారిక ప్రకటన ఏమీ రాకపోయినా రామకృష్ణ ఈ విషయాన్ని ప్రకటించేశారు.