Pawan kalyan: తెలుగును బతికించుకుందాం, పవన్ కల్యాణ్ పిలుపు..
తెలుగు భాష దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగును బతికిద్దాం.. తెలుగువారిగా జీవిద్దాం అని ఆయన అన్నారు. ఇటాలియన్ అఫ్ ఈస్ట్.. అజంత భాష.. అమర భాష.. ఇంతటి ఘన కీర్తి కలిగిన తెలుగు భాష దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా విశ్వవ్యాప్తంగా అల్లుకున్న తెలుగు వారందరికీ జనసేన పార్టీ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు వాడుక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకోవడం తెలుగువారి సౌభాగ్యమం అని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆయనకు అంజలి ఘటించారు. తెలుగును వాడుక భాషగా గిడుగు వంటి మహానుభావులు కృషి చేస్తే.. ఈనాటి పాలకులు తెలుగును వాడుక నుంచి కనుమరుగైపోయే అనాలోచిత చర్యలకు ఉపక్రమిస్తున్నారని విమర్శించారు. 'కొండ నాలుకకు మందేస్తే ఉన్ననాలుక పోయింది' అనే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఓట్ల వ్యామోహంలో కొట్టుకుపోతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు భాషకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే గుండె బరువెక్కక మానదన్నారు. ఒకప్పుడు దేశంలో రెండో స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్న వారి సంఖ్య 27 శాతం మించి లేదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో ఐదు దశాబ్ధాల్లో తెలుగు అంతరించిపోతున్న భాషల పట్టికలో చేరిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
మాతృ భాషతోనే సంస్కృతి సంప్రదాయాలు పరిఢవిల్లుతాయనే పెద్దల మాటలను విస్మరించరాదని తెలిపారు. భాష అంతరించిపోతే జాతి మొత్తం అంతరించిపోతుందన్నారు. అమ్మ భాషను బతికించుకోవడానికి తెలుగు వారందరూ నడుం కట్టాలన్నారు. పాలకులు ఏదో చేస్తారులే అన్న భావం విడనాడాలని సూచించారు. తెలుగు భాషాభిమానులు, స్వచ్ఛంధ సంస్థలు ముఖ్య భూమిక పోషించాలని తెలిపారు. భాషాభ్యున్నతికి చర్చా గోష్టులు, సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు.
భాషా పరమైన గ్రంథాల ముద్రణకు ముందుకు రావాలని కోరారు. ఊరికో తెలుగు భాషా సంఘం ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. పిల్లలను ఆంగ్ల మాధ్యమంలో చదివించినా వారికి తెలుగు నేర్పించడంలో పేరంట్స్ శ్రద్ధవహించాలని కోరారు. భాషా పరిరక్షణకు జనసేన పార్టీ తన వంతు కృషి చేస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తెలుగును బతికించుకుందాం.. తెలుగువారమని సగర్వంగా ప్రకటించుకుందాం అని చెప్పారు.
Recommended Video
తెలుగు భాషా దినోత్సవం విష్ చేస్తూనే విపక్షాలపై పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తెలుగు భాష ఉన్నతిని మరింత పెంచేందుకు ప్రభత్వాలు ఏం చేశాయని ప్రశ్నించారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. ఇంగ్లీష్ మీద మోజుతో విద్య సాగుతోందని చెప్పారు. అదీ కూడా స్పష్టంగా రావడం లేదని.. అన్నీ బట్టి చదువులేనని ఒకింత అసహనం వ్యక్తం చేశారు.