Pawan Kalyan : ఇప్పటంలో రోడ్డు విస్తరణా ? ఇడుపులపాయలో హైవే వేస్తామని పవన్ హెచ్చరిక
గుంటూరు జిల్లా ఇప్పటంలో నిన్న మున్సిపల్ అధికారులు చేపట్టిన ఇళ్ల కూల్చివేత వ్యవహారం చినికిచినికి గాలివానగా మారుతోంది. ఇప్పటంలో రోడ్డు విస్తరణ పేరుతో అధికారులు.. స్ధానికుల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసి బ్రేక్ వేయించిన జనసేనాని పవన్.. ఇవాళ గ్రామంలో పర్యటిస్తున్నారు. అంతకుముందు జనసేన కార్యాలయంలోనే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నా చివరకు పరిస్దితి గమనించి అనుమతించారు.
అనంతరం ఇప్పటానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ అధికారులు కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటంలో చోటుచేసుకుంటున్న పరిణామాల్ని స్ధానికుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు ఇళ్లను కూల్చివేయడంపై పవన్ మండిపడ్డారు. మా ఇళ్లు కూల్చారు, మీ కూల్చివేత తథ్యమని పవన్ హెచ్చరించారు.ఇప్పటంలో పరిస్ధితులపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్వగ్రామం పెదకాకానిలో 15 అడుగుల రోడ్డే ఉందని, అక్కడ రోడ్డు విస్తరణ అక్కర్లేదా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ చేయడానికి ఇప్పటం ఏమైనా కాకినాడా, రాజమండ్రా అని అడిగారు.గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు కానీ కానీ రోడ్డు విస్తరిస్తారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఇలాగే చేస్తే మేం ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. పోలీసులు రేపిస్టుల్ని రక్షిస్తూ కూల్చివేసిన వారికి కొమ్ముకాస్తున్నారని జనసేనాని విమర్శించారు.