ఆ తర్వాత భద్రత కావాలి, ఎందుకంటే: డీజీపీకి పవన్ లేఖ, ఇంటిమీదపడ్డ వారికి ఫ్యాన్స్ ఇలా..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభ తర్వాత కూడా తనకు భద్రత కొనసాగించాలని ఆయన అందులో పేర్కొన్నారు.
కుల ఉద్యమాలు, వర్గ పోరాటాలు, రాజకీయ అణిచివేతల నేపథ్యంలో రాజకీయ సమస్యలతో తనకు భద్రత ముడివడి ఉందని పేర్కొన్నారు. పవన్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను, విపక్షాలను నిలదీస్తోన్న విషయం తెలిసిందే.
కర్నాటకపై బాబు-జగన్-పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్!: రంగంలోకి 'తెలుగు' బీజేపీ నేతలు
భారీ బహిరంగ సభ
పవన్ కళ్యాణ్ బుధవారం గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. పార్టీ ప్రారంభించి నాలుగేళ్లయిన సందర్భంగా భారీ ఎత్తున నిర్వహించనున్నారు. ఇందుకోసం సభకు, పవన్కు భద్రతను ఇచ్చారు.
పూర్తిస్థాయి రాజకీయాల్లోకి
ఇటీవలి వరకు తనకు సమయం చిక్కినప్పుడల్లా పవన్ సమస్యలపై స్పందించేవారు. ఇప్పుడు సినిమాలను పక్కన పెట్టి పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి సారించారు. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న నేపథ్యంలో ఆయన సభ తర్వాత కూడా భద్రతను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ ఇంటి మీదా పడ్డారు
మరోవైపు, పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆయనను పలు పార్టీలు, వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని కాజలో ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయడాన్ని కూడా పలువురు ప్రశ్నించడం గమనార్హం.
వారికి అభిమానుల కౌంటర్
ఇరవై రెండేళ్ల సినీ ప్రస్థానంలో సొంత ఇళ్లు అమ్ముకోవడం, కారు వాయిదాలు కట్టుకోలేక అమ్మేయడాలు తెలిసిన పవన్.. అతికొద్ది రాజకీయ ప్రయాణంలో ప్రపంచస్థాయి అమరావతిలో సొంత ఇల్లు, ఆఫీస్ కట్టుకునే స్థాయికి చేరుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే కొన్ని ఆస్తులు అమ్ముకోవడం వేరు, సంపాదన వేరు అనే విషయం తెలియకపోవడం వారి అజ్ఞానానికి నిదర్శనమని అభిమానులు అంటున్నారు.