పవన్కి అవగాహన లేకే: సుబ్బిరామిరెడ్డి, బైరెడ్డి ఫైర్
హైదరాబాద్: అన్ని పార్టీల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభించిందని పార్లమెంటు సభ్యుడు సుబ్బిరామిరెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలపై సరైన అవగాహన లేనందునే కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి ఉంటారని ఆయన అన్నారు.
విభజన ప్రక్రియ బాగోలేదంటున్న భారతీయ జనతా పార్టీ విభజనకు ఎందుకు సహకరించిందని ఆయన ప్రశ్నించారు. తన తమ్ముడు పవన్ ఇవన్ని గమనించి ఉండాలని సుబ్బిరామిరెడ్డి అన్నారు. పవన్ మంచి మనిషి అన్న ఆయన, ఆయన సమాజ శ్రేయస్సు కోసం పార్టీ పెట్టారు కాబట్టి స్వాగతిస్తామని చెప్పారు.
తాను ఎప్పుడూ ఎవర్నీ విమర్శించలేదని, ఇప్పుడు కూడా పవన్ను విమర్శించేందుకు రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కాకుండా ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తాను అన్నాడంటే అతనికి పూర్తి స్థాయిలో రాజకీయ అవగాహన లేనట్టుగా తెలుస్తోం సుబ్బిరామిరెడ్డి అన్నారు. పవన్ అంటే తనకెంతో అభిమానమని, అయితే అతను ప్రజాస్వామ్యంలో అందరినీ కలుపుకుని పోవాలని అన్నారు.
అన్నాదమ్ములు నాటకాలాడుతున్నారు: బైరెడ్డి
కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన తమ్ముడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాటకాలాడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ మండిపడ్డారు.చెరో పార్టీలో ఉంటే ఎవరు అధికారంలో ఉన్నా పనులవుతాయని చూస్తున్నారని విమర్శించారు. రాజకీయాలంటే సినిమాలో నటించినంత సులువు కాదని బైరెట్టి అన్నారు. రాయలసీమ సంస్కృతి గురించి పవన్ కళ్యాణ్కు ఏం తెలుసని ఆయన ప్రశ్నించారు.