సిద్ధమౌతున్న పవన్ కళ్యాణ్: విశాఖ ఎన్నికలపై కన్ను వెనుక పెద్ద ప్లాన్
విశాఖ: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు! ప్రస్తుతానికి త్వరలో జరగనున్న విశాఖ మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై గురి పెట్టారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమవుతోంది.
పవన్ హైదరాబాద్లో శనివారం విలేకరులతో మాట్లాడారు. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి పెరుగుతోందని చెప్పారు. దీంతో ఆయన పోటీ చేస్తారనే వాదనకు ఇది మరింత బలం చేకూరుతోంది. అయితే ఒంటరిగా బరిలోకి దిగుతారా లేక ఏదైనా పార్టీతో పొత్తు ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్ హెచ్చరిక, ఇక రంగంలోకి జగన్: ఇరుకునపడ్డ బాబు, జాగ్రత్త!
అభిమానుల్లో ఉత్సాహం
పవన్ వ్యాఖ్యలు విశాఖలోను చర్చకు దారి తీశాయి. అభిమానాలు, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి. ఆయన 2014 సాధారణ ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించి టిడిపి, బీజేపీల కూటమికి మద్దతిచ్చారు. జనసేన మాత్రం పోటీ చేయలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
పొత్తు ఉండకపోవచ్చు!
జీవీఎంసీ ఎన్నికల్లో టిడిపితో లేదా బీజేపీతో పొత్తు ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం నేపథ్యంలో పొత్తు ఉండకపోవచ్చునని భావిస్తున్నారు. ఇస్తానని చెప్పిన బీజేపీ తగ్గడం, తెస్తానని చెప్పిన టిడిపి కొత్త రాగం అందుకున్న నేపథ్యంలో వారికి దూరం జరగవచ్చునని అంటున్నారు.
2019కి ముందు ఎందుకంటే..
త్వరలో జరగబోయే విశాఖతోపాటు మిగిలిన కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తోందని పవన్ చెప్పారు. ఆయన మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఒకేసారి సాధారణ ఎన్నికల బరిలో దిగడంకంటే, అంతకు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వీలుంటుందనే భావనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. నేరుగా సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఉండదని, ఇప్పటి నుంచి ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ వెళ్తే ఫలితం ఉంటుందని ఆయన అభిప్రాయంగా భావిస్తున్నారు.
విశాఖలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు కొద్ది రోజుల నుంచి తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ రెండున గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు.