కాపులపై వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్కు చిక్కులు: ఫ్లెక్సీల చించివేత
విజయవాడ: కేరళ నుంచి హైదరాబాద్ వచ్చేసి తుని ఘటనలపై మాట్లాడిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఆయనపై గుర్రుగా ఉంది. ఆయన ఫ్లెక్సీలను కాపు యువకులు చించేశారు.
గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పొడి గ్రామంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్, భీమవరం ప్రాంతాల్లోనూ కాపు యువకులు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను బుధవారంనాడు ధ్వంసం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన సమయంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమర్థిస్తున్నట్లు వారు భావిస్తున్నారు.
ఫ్లెక్సీలను చించేయడమే కాకుండా పవన్ కల్యాణ్కు వ్యతిరేకంగా యువకులు నినాదాలు కూడా చేశారు. తాను ఓ కులానికి చెందినవాడిని కానని, ఓ కులం కోసం పోరాటం చేయడానికి తాను ఇక్కడికి రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వానికి, కాపు సామాజిక వర్గానికి మధ్య రాయబారం నెరపడానికి కూడా ఆయన ఇష్టపడలేదు.

పవన్ కల్యాణ్ మద్దతు కారణంగానే ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కాపులు, ప్రకాశం జిల్లాలోని ప్రాంతాల కాపులు బిజెపి, టిడిపి కూటమికి ఎన్నికల్లో ఓటేశారు. ఆయన మద్దతుతో పాటు కాపులను బిసీలో చేరుస్తామనే చంద్రబాబు హామీ కూడా ఆ కూటమికి అనుకూలంగా మారింది.
రాష్ట్ర రాజధాని అమరావతి కోసం బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రంగంలోకి దిగినప్పుడు పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేసి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, విమర్శిస్తూ దాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారని, అలాగే కాపు ఆందోళన విషయంలోనూ వ్యవహరిస్తున్నారని, ఇది ప్రభుత్వానికి పరోక్షంగా ఉపయోగపడడానికి మాత్రమేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications