రాయలసీమ గర్జన పెట్టడానికి కారణమేమిటంటే!!
రాయలసీమ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోపాటు సర్పంచ్ నిధులను కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు ఎంత ఖర్చు చేశాం.. ఈ మూడున్నర సంవత్సరాల్లో తామెంత ఖర్చుపెట్టారో సీమ గర్జనలో చెప్పాల్సిందని సూచించారు. అలా చెబితే వాస్తవాలన్నీ వెల్లడయ్యేవన్నారు. ప్రభుత్వ న్యాయవాది అమరావతిలోనే హైకోర్టు ఉండాలంటారని, తెలంగాణ ప్రాజెక్టులపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకే గర్జన ఏర్పాటు చేశారన్నారు.
మనం చూడబోయేది ముందస్తు ఎన్నికలేనని, ప్రభుత్వం తన అస్తిత్వం కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతోందని పయ్యావుల తెలిపారు. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి దివంగత ఎన్టీఆర్ ఎవరి ఊహకు అందని విధంగా గాలేరు, నగరి, హంద్రీనీవా ఆయన మనసులో నుంచి వచ్చాయన్నారు. సీమ గర్జన కేవలం చంద్రబాబును తిట్టడానికే పెట్టినట్లుందని ఎద్దేవా చేశారు. రాయలసీమకు ద్రోహం చేసిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. రాయలసీమను ఈ మూడున్నర సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి దిశగా నడిపించామో తెలియజేస్తే ప్రజలకు ఒక అవగాహన ఉండేదని, రానున్న ఎన్నికల్లో ఎవరిని ఎంచుకోవడానికి వీలవుతుందో వారికి ఒక స్పష్టత వచ్చేదిన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు కోరుతూ వివిధ ప్రజాసంఘాలు, జేఏసీల ఆధ్వర్యంలో జరిగిన రాయలసీమ గర్జనకు ప్రభుత్వ మంత్రులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం మూడు రాజధానులు ఎందుకు అంటుందో, దానివల్ల ఉపయోగాలేంటనేది ప్రజలకు వివరించారు.