కవిత, జగన్లతో రేవంత్, కేసీఆర్ భేటీ, ఢిల్లీ చిట్టా విప్పుతా: పయ్యావుల సంచలనం
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ నేత పయ్యావుల కేశవ్. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఏపీ నేత పయ్యావుల కేశవ్. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై స్పందించాలా? లేదా? అని సందిగ్ధంలో పడ్డానని, అయితే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని మాట్లాడుతున్నానని తెలిపారు. వ్యక్తిగతంగానే స్పందిస్తున్నాని తెలిపారు.
Recommended Video
కేసీఆర్ని కలిస్తే తప్పేంటి?.. రేవంత్ ప్రస్తావనే లేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేసీఆర్తో ఏవో వ్యాపార సంబంధాలున్నాయని అంటగట్టడం దారుణమని పయ్యావుల కేశవ్ అన్నారు. కేసీఆర్తో తాను జరిపిన సంభాషణల్లో రేవంత్ ప్రస్తావనే రాలేదని స్పష్టం చేశారు.
రేవంత్ సర్టిఫికేట్ అవసరం లేదు..
తన పాతికేళ్ల రాజకీయ జీవితంలో పార్టీకి నష్టం కలిగే పని ఎప్పుడూ చేయలేదని పయ్యావుల కేశవ్ తెలిపారు. తనకు, ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడికి రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదని తేల్చి చెప్పారు.25 ఏళ్లుగా పార్టీలో సైనికుడిలా పనిచేస్తున్నాని పయ్యావుల చెప్పారు.
రేవంత్ చిట్టా వుంది..
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. రేవంత్ రెడ్డికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని పయ్యావుల గుర్తు చేశారు.చంద్రబాబు ప్రోత్సాహం వల్లే తాను, రేవంత్ ఈ స్థాయికి ఎదిగామన్నారు. తనకంటే రేవంత్ను చంద్రబాబు ఎక్కువగా ప్రోత్సహించారని చెప్పారు. అంతేగాక, 6నెలలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పర్యటనలు చేస్తున్న సమాచారం తన వద్ద ఉందని కేశవ్ చెప్పారు.
అప్పుడే స్పందిస్తా..
చంద్రబాబును రేవంత్ రెడ్డి కలిశాకే పూర్తి స్థాయిలో స్పందిస్తానని పయ్యావుల కేశవ్ చెప్పారు. రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? అనే అంశంపై ఇప్పుడే స్పందించనని అన్నారు. రేవంత్ రెడ్డికి వ్యక్తిగత ఎజెండానే ముఖ్యమని ఆరోపించారు.
జగన్తోనూ రేవంత్కు సంబంధాలు..
తనకు, మంత్రి పరిటాల కుటుంబానికి తెలంగాణలో ఎలాంటి వ్యాపారాలు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఒక్క ప్లాటు కూడా లేదని పేర్కొన్నారు. లేని నా వ్యాపారాలపై మాట్లాడే ముందు రేవంత్ తన వ్యాపారాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితోనూ రేవంత్ రెడ్డికి సంబంధాలున్నాయని కేశవ్ ఆరోపించారు.జగన్తో అంటకాగిన విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కవితతో కలిసి..
అంతేగాక, టీఆర్ఎస్ ఎంపీ కవితతో కలిసి రేవంత్ రెడ్డి ఓ కంపెనీని రిజిష్ట్రేషన్ చేయించారని పయ్యావుల ఆరోపించారు. తాను కూకట్ పల్లి నుంచి పోటీ చేస్తానన్న అబద్ధపు ప్రచారమేనని పయ్యావుల కొట్టిపారేశారు.
కాంగ్రెస్లో చేరికపై ఉత్కంఠ: ఆ నేత వల్లే నొచ్చుకున్న రేవంత్, అందుకే ఇలా
రేవంత్ జైలుకెళితే.. నేనే మొదట స్పందించా..
రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తే మొదట స్పందించిన వ్యక్తిని తానేనని గుర్తుచేశారు. ఆయన కుటుంబానికి బాసటగా నిలిచానన్నారు. రేవంత్ను కాపాడేందుకు ఎక్కువ సమయం కేటాయించి నష్టపోయామని పయ్యావుల కేశవ్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యల వల్ల తనకంటే ఆయనకే ఎక్కువ నష్టమని పేర్కొన్నారు.