'ఎన్టీఆర్'కి ముసుగుపై కేశవ్, తారక్పై కేసు యత్నమని
వరంగల్/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు ముసుగు వేయకుండా చూడాలని, వేసిన చోట ముసుగులను తొలగించమని ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్ లాల్ను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కోరారు.
మంగళవారం ఆయన ఎన్నికల అధికారికి(ఈసి) లేఖ రాశారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలకు స్మృతి చిహ్నంగా ఆయన విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు నెలకొల్పారని తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయనగరం జిల్లాలో అధికారులు ఎన్నికల కోడ్ పేరుతో ఎన్టీఆర్ విగ్రహాలకు ముసుగులు వేయడాన్ని ఈసి దృష్టికి తీసుకువచ్చారు.
ఎన్టీఆర్ మనవడు తారక రత్న పర్యటనలో కొన్నిచోట్ల విగ్రహాలకు పూలదండలు వేయడాన్ని అధికారులు కేసులు పెట్టడానికి చూస్తున్నారన్నారు.
పార్టీ మారను: ఎర్రబెల్లి
తాను తెలుగుదేశం పార్టీని వీడటం లేదని ఎర్రబెల్లి దయాకర రావు చెబుతున్నారట. పార్టీ ఆవిర్భావం నుండి తాను ఎంతో కష్టపడ్డానని, పార్టీ కోసం పని చేశానని, తనకు న్యాయంగా లభించవల్సిన పదవిని అడుగుతున్నానని, కన్నతల్లి లాంటి పార్టీని వదిలే ప్రసక్తి లేదని చెబుతున్నారట.