కెసిఆర్తో ఏదో లాలూచీ, అందుకే హైదరాబాద్ వదిలిన బాబు: పెద్దిరెడ్డి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బుధవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. తెలంగాణ సీఎం కెసిఆర్తో ఏం లాలూచీ పడి విజయవాడకు తరలి వచ్చారో చెప్పాలని నిలదీశారు.
ప్రభుత్వం కేవలం రాజధాని అమరావతి గురించే నిత్యం మాట్లాడటం విడ్డూరమన్నారు. వారు అమరావతి విషయంలో దురాలోచనతో పని చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో ఈ రెండేళ్ల పాటు ఏ అభివృద్ధి జరగలేదన్నారు.
చంద్రబాబు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తమ పార్టీ నుంచి గెలిచి టిడిపిలో చేరిన వారితో చంద్రబాబు రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. వారు గెలిస్తే మేం మాట్లాడమన్నారు. వారు ఓడితో మాత్రం చంద్రబాబు సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు.
భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్లతో రాజీనామా చేయించాకే చంద్రబాబు మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు వెళ్లకుంటే నైతికంగా చంద్రబాబుకు ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదన్నారు. హైదరాబాదులో, తెలంగాణలో, ఏపీలో చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలు గుర్తించాలన్నారు.
చంద్రబాబును ఏపీ ప్రజలు రెండేళ్లు భరించాలంటే అది చాలా ఎక్కువ అన్నారు. తెలంగాణలో టిడిపి నేతలు తెరాసలో చేరితే తిడుతున్న చంద్రబాబు, ఏపీలో వైసిపి సభ్యులను ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఇది రెండు కళ్ల సిద్ధాంతం అన్నారు.
కెసిఆర్తో లాలూచీ ఏమిటో
తెలంగాణ సీఎం కెసిఆర్తో ఏం లాలూచీ పడ్డారో చెప్పాలని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి డిమాండ్ చేశారు. ఓటుకు నోటు నేపథ్యంలో చంద్రబాబు.. కెసిఆర్తో లాలూచీ పడ్డారన్నారు. ఆ లాలూచీ కారణంగానే హైదరాబాదు నుంచి విజయవాడకు ప్రభుత్వాన్ని తరలిస్తున్నారన్నారు.
చంద్రబాబుకు కెసిఆర్తో ఏం ఒప్పందం జరిగింతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కోసం రూ.5 కోట్లు ఇవ్వచూపిన టిడిపి తమకు నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. మా సభ్యులను ప్రలోభ పెట్టడం విడ్డూరమన్నారు.
మేం చంద్రబాబు పైన పోరాడుతాం తప్ప.. తమ ఎమ్మెల్యేలు వెళ్తే పోరాడాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు తమ పార్టీ నుంచి పదిమంది ఎమ్మెల్యేలను తీసుకు వెళ్తానని చెప్పారని, కానీ ఆయన తీసుకు వెళ్లింది కేవలం నలుగురినే అన్నారు.