చంద్రబాబు తీరుతో.. గతంలో వారు కన్నీళ్లు పెట్టుకున్నారు: పెద్దిరెడ్డి
సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వైసీపీ నాయకులు ప్రివిలేజ్ కమిటీ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలిపారు.
హైదరాబాద్: ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ శాసనసభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. సభను సజావుగా నడపలేక ప్రతిపక్ష నాయకుల మీద అధికార పక్షం వారు అభాండాలు వేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సభ జరిగే తీరు స్పీకర్, సభానాయకుడి మీద ఆధారపడి ఉంటుందని పెద్దిరెడ్డి అన్నారు. సభలో జరిగిన పరిణామాలపై నోటీసులు అందుకున్న వైసీపీ నాయకులు ప్రివిలేజ్ కమిటీ ముందు వివరణ ఇచ్చుకున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సమావేశంలో వెల్లడించినట్టు పేర్కొన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో.. గతంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును ప్రస్తావించామని చెప్పారు పెద్దిరెడ్డి. ఆయన తీరుతో కుతూహలమ్మ, ఆలపాటి ధర్మరావు వంటి నేతలు కన్నీళ్లు పెట్టుకున్న సంగతి గుర్తుచేశామన్నారు. కొంతమంది టీడీపీ సభ్యులు గవర్నర్ పై దాడికి యత్నించిన సంఘటనలను వివరించినట్టుగా తెలిపారు.
కాగా, ప్రత్యేక హోదా అంశంపై చర్చ జరగాల్సిందిగా సభలో పట్టుబట్టినందుకు ప్రివిలేజ్ కమిటీ 12మందికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.