హైవేల దిగ్బంధం: బాబు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించిన వైసీపీ
అమరావతి: విజయవాడలో వైయస్ విగ్రహం తొలగింపుపై రగడ కొనసాగుతోంది. బస్టాండ్కు సమీపంలో ఉన్న వైయస్ విగ్రహం తొలగించిన ప్రాంతాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఫైర్ స్టేషన్లో ఉంచిన వైయస్ విగ్రహన్ని పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి హోదాలో వైయస్ విగ్రహ ఏర్పాటుకు తానే అనుమతిచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైయస్ విగ్రహనికి అన్ని అనుమతులు ఉన్నా.. ప్రభుత్వం కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించిందని ఆయన మండిపడ్డారు.
ఎక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించారో తిరిగి అక్కడే విగ్రహాన్ని పనరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాల్లో భాగంగా శుక్రవారం అర్థరాత్రి విజయవాడ కంట్రోల్ రూమ్కు ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే.
చంద్రబాబు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు: గొల్ల బాబూరావు
విజయవాడలో వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించడం కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని గాయపరిచిందని వైసీపీ నేత గొల్ల బాబూరావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విగ్రహాల తొలగింపుపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
గతంలో ఏ రాజకీయ నాయకుడూ ఈ విధంగా మాట్లాడలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తొలగించినచోటే వైయస్ విగ్రహాన్ని పునరుద్ధరించాలని లేదంటే చంద్రబాబు సర్కారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్కు హైవేలపై నిరసన తెలపనున్నట్టు ఆయన పేర్కొన్నారు.