ఆయన చెప్పడమేమిటి, పార్టీ మారనని జగన్కే చెప్పా: పెద్దిరెడ్డి
చిత్తూరు: తన గురించి మాట్లాడేందుకు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఎవరని, ఆయన చెబితే పార్టీ మారుతామా, నా వ్యక్తిత్వం నాకు ఉందని పుంగనూరు ఎమ్మెల్యే, వైసిపి నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు.
ఎన్నికల తర్వాత శాసన సభా పక్ష సమావేశంలో జగన్ సమక్షంలోనే పార్టీ మారబోనని స్పష్టం చేశానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసిపి ఎమ్మెల్యేలను రకరకాల ప్రలోభాలకు గురి చేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు.
ప్రజల అభిమానంతో పదవులు పొందే వారికి శాశ్వత గుర్తింపు ఉంటుందని చెప్పారు. డబ్బులు, అధికారం కోసం పార్టీలు మారే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుందన్నారు. వారికి మనుగడ ఉండదన్నారు. రాష్ట్రంలో టిడిపి సర్కార్ విఫలమైందని, రెండేళ్లుగా ప్రజలకు చేసిందేం లేదన్నారు.
తూర్పు వైసిపి అధ్యక్షునిగా కన్నబాబు
తూర్పు గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ప్రసన్న కుమార్ను నియమించారు. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరిన విషయం తెలిసిందే.