ఫోన్ ట్యాపింగ్ కాదు - చేసింది ట్రాకింగ్ : చంద్రబాబు రెచ్చగొడుతున్నారు - మంత్రి పెద్దిరెడ్డి..!!
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రం శ్రీలంక అవుతోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చంద్రబాబు కడపుమంటతో విష ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ విషయంలో ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు తాను చెప్పలేదని..దాదాపు 60 మందిని విచారించి..వారి ఫోన్లను ట్రాకింగ్ చేసారని మాత్రమే చెప్పానని మంత్రి స్పష్టం చేసారు. ఫోన్ ట్యాపింగ్ తప్పనే విషయం తనకు తెలుసన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేసారని ఫైర్ అయ్యారు.
చంద్రబాబు తన వయసు..అనుభవానికి తగినట్లుగా మాట్లాడటం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రభుత్వంపైనా..సీఎం జగన్పై బురదజల్లడమే చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ పనిగా పెట్టుకున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని.. ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీటర్లు బిగిస్తే రైతుల మెడకు ఉరితాళ్లు బిగించినట్లేనని చంద్రబాబు విమర్శించటాన్ని ఆయన తప్పు బట్టారు. పారదర్శకత కోసమే వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే నిర్ణయం అమలు అవుతుందని మంత్రి వివరించారు.
రైతుల ఖాతాలు ఓపెన్ చేసి..వంద శాతం బిల్లులు వారి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి వెల్లడించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఆర్థికసాయం అందించిన ఘనత వైయస్ జగన్కే సొంతమన్నారు. సీఎం వైయస్ జగన్ చేసిన మేలు రాష్ట్ర ప్రజలందరికీ గుర్తుందన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలంతా హారతులతో ముందుకువచ్చి స్వాగతం పలుకుతున్నారని, సంక్షేమ పథకాలు అందుతున్నాయని సంతోషంగా చెబుతున్నారని, చంద్రబాబుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదని, ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మీద నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు.