జబర్దస్త్ టీవీ షోలో మాదిరిగా వెకిలి చేష్టలు: రోజాపై పీతల విసుర్లు
ఏలూరు: అసెంబ్లీ అంటే జబర్ధస్త్ టీవీ షో కాదని, పవిత్రమైన అసెంబ్లీ విలువలను కాపాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ప్రతీ ఒక్కరూ సహకరించాలని, ఈ విషయాన్ని సస్పెన్షన్కు గురైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు ఆర్కె రోజా గుర్తుంచుకోవాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు.
స్ధానిక శనివారపుపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. రోజా అహంభావంతో వ్యవహరిస్తున్నారే తప్ప అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు నేటికీ చింతించడం లేదని, సభను క్షమాపణ కోరడం లేదని ఆమె అన్నారు. ఇప్పటికైనా రోజా దళితులను, బలహీన వర్గాలను కించపరిచే ధోరణి మానుకోవాలని సూచించారు.
అసెంబ్లీలో తనపట్ల, సాటి మహిళా శాసనసభ్యురాలు అనిత పట్ల అనుచితంగా మాట్లాడిన తీరుకు తాము ఎంతో మనస్థాపానికి గురయ్యామని ఆనాడే పోలీసు కేసు పెట్టి ఉంటే రోజా జైలులో కటకటాలు లెక్కించే స్థితిలో ఉండేదని పెద్ద మనస్సుతో తాము ఆ పని చేయలేదని అయితే రోజాలో మార్పు వస్తుందని అనుకుంటున్నామని, కానీ ఆమె జబర్ధస్త్ షోలో వ్యవహరించినట్లు వెకిలిచేష్టలు మానుకోలేదని మంత్రి అన్నారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్మోహన్రెడ్డి దళిత ద్రోహులుగా మిగిలిపోతారని, వై ఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 వేల కోట్ల రూపాయల ఎస్సి సబ్ప్లాన్ నిధులను పులివెందుల, ఇడుపులపాయ రింగు రోడ్డు నిర్మాణం కోసం ఖర్చు చేసి దోచుకున్నారని, నిజంగా దళితవాడల్లో అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులనుస్వార్ధంతో పులివెందులకు తరలించారని విమర్శించారు.
గ్రూప్-1 పరీక్షలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక విద్యార్ధికి 535 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో అతనికి 85 మార్కులు కలిపి ఆర్డివో పోస్టు ఇచ్చారని అదే దళిత విద్యార్ధికి 635 మార్కులు వస్తే ఆడిట్ ఆఫీసరుగా నియమించారని, ఇది వై ఎస్ పాలనలో దళితులకు జరిగిన అన్యాయానికి నిదర్శనమని సుజాత అన్నారు.
రాష్ట్రంలో దళిత గిరిజనుల జీవితాలతో ఆటలాడుకోవాలని చూస్తే ప్రతిపక్షానికి పుట్టగతులుండవని ఇప్పటికైనా రాష్ట్రంలో దళితుల, గిరిజనుల సంక్షేమానికి చేపట్టే కార్యక్రమాలకు ప్రతిపక్షం సహకరించాలని ఆమె కోరారు. తెలుగుదేశం ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి పైన అపవాదు వేయాలని రోజా ప్రయత్నిస్తోందని ఇప్పటికైనా హద్దులు దాటి వ్యవహరించవద్దని ఆమె సూచించారు.