ఏపీ కొత్త జిల్లాల ప్రభావం-పెన్షన్లు, రేషన్ ఆలస్యం-జేసీల తగ్గింపు-ఐటీడీఏలపై సప్పెన్స్
ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేశాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 13 జిల్లాల స్ధానంలో 26 జిల్లాలు అమల్లోకి రాగా.. మరో కొత్త జిల్లా ఏర్పాటుపైనా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చేసింది. దీంతో 27 జిల్లాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొత్తగా అమల్లోకి వచ్చిన జిల్లాల కారణంగా అప్పటికే జిల్లాల వారీగా అమలవుతున్న పలు సంక్షేమ పథకాలతో పాటు కార్యనిర్వాహక వ్యవస్ధపైనా ప్రభావం పడుతోంది. దీంతో అధికారులు లోపాల్ని సరిదిద్దే పనిలో బిజీగా కనిపిస్తున్నారు.

ఏపీ కొత్త జిల్లాల ఎఫెక్ట్
ఏపీలో కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 26 జిల్లాలకు తోడు త్వరలో రంపచోడవరం లేదా పోలవరం పేరుతో మరో జిల్లా కూడా అందుబాటులోకి రానుంది. దీంతో 27 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అవతరించబోతోంది. అదే సమయంలో ఇప్పటికే జిల్లాల వారీగాసాగుతున్న పాలనను కొత్త జిల్లాలకు అనుగుణంగా సరిచేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలతో పాటు అధికార వ్యవస్ధలపైనా ప్రభావం పడుతోంది. దీంతో కొన్ని రోజులు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.

పెన్షన్లు, రేషన్ ఆలస్యం
కొత్త జిల్లాలు అమల్లోకి రావడంతో గతంలో ఉన్న లెక్కల్ని సవరించి కొత్తగా పెన్షన్లు, రేషన్ ఇచ్చే విషయంలో ప్రభుత్వానికి ఈ నెలలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికే పెన్షన్లు ఆలస్యం కావడంతో వాటిని ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలో విధించిన ఐదో తేదీ గడువును కూడా ఏడో తేదీకి పెంచారు. ఇదే కోవలో రేషన్ పంపిణీ ప్రతీ నెలా 4వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అది కాస్తా 8వ తేదీ నుంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో లబ్దిదారులు వీటి కోసం పడిగాపులు పడుతున్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాలు అమల్లోకి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతోంది.

జడ్పీలు సేమ్, ఐటీడీఏలపై సస్పెన్స్
రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాకూ జిల్లా పరిషత్ తో పాటు ఐటీడీఏలు కూడా ఉంటాయి. వీటిలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో అప్పటికే ఎన్నికైన జిల్లా పరిషత్ లను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన 13 జిల్లా పరిషత్ లే గడువు తీరే వరకూ కొనసాగనున్నాయి. మరోవైపు ఐటీడీఏల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. వీటికి ఎలాంటి గడువులేకపోవడంతో పెంచే ఆలోచన చేయొచ్చని తెలుస్తోంది. అలాగే కొత్త జిల్లాల నేపథ్యంలో అప్పటికే జిల్లాకు ముగ్గురుగా ఉన్న జేసీలను కేవలం ఒకరికే పరిమితం చేయడంతో పాటు ఉన్న జేసీల్లో సీనియర్లను ప్రభుత్వం కలెక్టర్లుగా అవకాశం ఇచ్చింది.












Click it and Unblock the Notifications