బాబూ.. మీ ఒక్క పథకం.. ప్రజలకు గుర్తుకొచ్చేదీ ఉందా..? విజయసాయిరెడ్డి విసుర్లు..
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ రేంజ్లో ఫైరయ్యారు. మీ 14 ఏళ్ల పాలనలో ఒక్క పథకం గుర్తుకొచ్చేది ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్, దివంగత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల మదిలో మెదలతాయని పేర్కొన్నారు. మరి మీ సంగతేంటి అని విరుచుకుపడ్డారు.

వైఎస్ఆర్, జగన్ మాదిరిగా..
పిల్లలు, తల్లుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ప్రారంభించారు. వైఎస్సార్ లాగా, సీఎం జగన్ లాగా చంద్రబాబును గుర్తుకు తెచ్చే పథకం ఒక్కటీ లేదన్నారు. ఎన్నికల ముందు నోటికొచ్చిన అబద్ధాలు చెబుతాడని, తర్వాత మరచిపోవడం ఆయన నైజం అని పేర్కొన్నారు. నగదు పంచి ప్రజాభిప్రాయాన్ని మార్చొచ్చనే భ్రాంతిలో మునిగితేలుతుంటాడని విమర్శలు చేశారు.

30 లక్షలకు పైగా లబ్ది
ఇందుకోసం పెట్టుబడిదారీ ముఠాను తయారుచేశాడని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా 30 లక్షల 16 వేల మంది గర్భవతులు, పిల్లలు నాణ్యమైన పోషకాహారం అందుతుందని విజయసాయి రెడ్డి వెల్లడించారు. భవిష్యత్లో గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తోందని తెలిపారు.

ఆత్మతృప్తి: సీఎం జగన్
ప్రజలకు మంచి చేయాలని భావించి ప్రవేశపెట్టిన పథకాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ఒకటని సీఎం జగన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమాలతో ఎంతో సంతృప్తి కలుగుతుందన్నారు. ఇదివరకు పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు ఉన్నారా, వారి శారీరక, మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, తల్లులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారా అనే విషయాలు ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు.
వైఎస్ఆర్ పోషణ ప్లస్
6 నుంచి 72 నెలల లోపు వయసున్న పిల్లలకు, బిడ్డలకు జన్మనివ్వనున్న మహిళలకు, బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్సార్ పోషణ, వైఎస్సార్ పోషణ ప్లస్ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఒక కుటుంబం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడి ఉంటే, ఆ కుటుంబాల్లో విటమిన్లు, మినరల్స్ లోపంతో ఉన్న పిల్లలు, తల్లులు ఎక్కువగా కనిపిస్తుంటారని తెలిపారు.












Click it and Unblock the Notifications