వైఎస్ అనుమతి ఇచ్చారు, ఇప్పుడు వారే గొడవ: చంద్రబాబు
న్యూఢిల్లీ: వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారని, అప్పుడు అనుమతి ఇచ్చిన పాలకపక్షమే ఇప్పుడు ప్రతిపక్షంగా దుమారం రేపుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలను గిరిజనుల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
విశాఖ జిల్లా గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తగిన చర్యలు తీసుకుంటూ తవ్వకాలు నిర్వహించడానికి కేంద్ర గనుల శాఖ అనుమతి ఇచ్చిందని, ఆంధ్రప్రదేశ్ గనుల అభివృద్ధి సంస్థ పెట్టుకున్న అర్జీని పరిశీలించిన కేంద్రం ఈ అనుమతి ఇచ్చిందని చంద్రబాబు మీడియాతో చెప్పారు. తమ ప్రభుత్వం అన్ని విషయాలనూ ప్రతి ఒక్కరితో సంప్రదించిన తర్వాతే బాక్సైట్ తవ్వకాలపై ఒక నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
చిత్తూరు జిల్లాలో 250 కోట్ల పెట్టుబడితో ఒక పింగాణి పరిశ్రమ వస్తుందని, పునర్విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసేలా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం ఉందని ఆయన అన్నారు. వైద్య చికిత్సలో ఉపయోగించే వివిధ పరికరాల ఉత్పత్తి కేంద్రం ఒకటి విశాఖకు వస్తోంది. హబ్ ఏర్పాటుకు కావాల్సిన భూమి, ప్రాథమిక సదుపాయాల కల్పనకు సిఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు.
వైద్య చికిత్సల్లో ఉపయోగించే పరికరాల ఉత్పత్తిదారులతో శుక్రవారం సిఎం చంద్రబాబు సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల్లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర, కేంద్ర ఉన్నతాధికార్లు హాజరయ్యారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అమలు చేయతలపెట్టిన వివిధ పథకాలపై సమావేశంలో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బయో టెక్నాలజీ అభివృద్ధిపై సిసిఐ ప్రతినిధులతో సంప్రదించారు. ఈ రంగం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఫిబ్రవరిలో జరిగే ఒక సదస్సుకు హాజరుకావాల్సిందిగా సిఎం చంద్రబాబును ఆహ్వానించారు.
గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సిఎం చంద్రబాబు శుక్రవారం బిజీబిజీగా గడిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక పాకేజీ ప్రకటించటంపై ఒక నిర్ణయం తీసుకోవాలని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు పాణిగరియాతో ప్రత్యేకంగా సమావేశమైన సిఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై రోడ్డు మ్యాప్ తయారుచేసి సమర్పించాలని ప్రధాని మోడీ నీతి ఆయోగ్ను ఆదేశించిన సంగతి తెలిసిందే.