పవన్ వైజాగ్ రిటర్న్ అందుకే-రీజన్ చెప్పిన పేర్నినాని- జనసైనికులకిచ్చిన మాటతప్పారంటూ..
ఏపీలో రాజధానుల రాజకీయం నేపథ్యంలో విశాఖలో రెండు రోజులుగా చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. మూడు రోజుల టూర్ కోసం విశాఖ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్రిక్తతల మధ్యే ఇవాళ విజయవాడకు తిరుగుపయనం అయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్నినాని ఆయన్ను టార్గెట్ చేశారు. విశాఖలో పరిణామాలు, అమరావతి రాజధాని పేరుతో జరుగుతున్న రాజకీయాలపై పేర్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ రాజకీయ నేతా ? ఫ్యాక్షన్ నాయకుడా ?
వైజాక్ వచ్చి పిటిషన్స్ తీసుకుంటానని వచ్చి పిటిషన్స్ తీసుకోండి అంటే అలా కాదు నా మంది ని విడుదల చేస్తే కానీ వెళ్ళాను అంటాడని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అంటే మంత్రులపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేసిన నేర చరిత్ర ఉన్నవారికి కొమ్ము కాస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయ్య నాయకుడా లేక ఫ్యాక్షన్ ముఠాకు నాయకుడా చెప్పాలన్నారు. ఇంతకు ముందు తిరుపతిలో, విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, అదేదో పెద్ద ప్రజా కార్యక్రమం అని మీరంటారు లేదు అది పెద్ద డ్రామా అని తామంటామని పేర్ని వ్యాఖ్యానించారు.
షూటింగ్స్ కోసమే వైజాగ్ నుంచి రిటర్న్
పవన్ కార్యక్రమాన్ని తాము ఆపలేదని, టీవీల నిండా, పేపర్ల నిండా వార్తలు కావాలి మళ్ళీ రేపటి నుండి షూటింగ్ లకు వెళ్లిపోవాలి కాబట్టి పవన్ విశాఖ వదిలి వచ్చేశారని పేర్ని నాని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు 3 రోజులు షూటింగ్ లో ఖాళీదొరికింది కాబట్టి వచ్చాడని, వైజాక్ నుండి కదలనని చెప్పి, ఇప్పుడు ఎందుకు వెళ్లిపోతున్నాడని పేర్ని ప్రశ్నించారు. పర్మనెంట్ గా రూమ్ అద్దెకు తీసుకొని తన వారందరు వచ్చే వరకు పవన్ వైజాగ్ లోనే ఉంటాడని తాను అనుకున్నానని పేర్ని తెలిపారు. ఇంకా 8 మంది లోపల ఉన్నారుగా.. మరి వాళ్ళను వదిలిపెట్టి వెళ్తున్నాడని పేర్ని ఎద్దేవా చేశారు.
మాట తప్పిన పవన్
పవన్ కళ్యాణ్ ఒకే మాట మీద నిలబడడని, చంద్రబాబు కు ఒక శాపం ఉందని, ఆయన నోట నిజం వస్తే ఆయన తల వెయ్యి ముక్కలవుతుందని అలాగే పవన్ కళ్యాణ్ కు మాట మీద నిలబడితే అదే శాపం ఇతనికి ఉందేమో తెలియట్లేదని పేర్ని సెటైర్లు వేశారు. పవన్ రోజుకో మాట మాట్లాడతాడని, ఆయనకు రాజకీయాల కన్నా చంద్రబాబు ప్రయోజనం, మేలు పొందాలని ఉంటుందన్నారు. చంద్రబాబు పచ్చగా ఉండాలి కోరుకునే వ్యక్తి, తన అన్నయ్య కన్నా చంద్రబాబు బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్ని విమర్శించారు.
ఎక్కడికెళ్తే అదే రాజధాని
అమరావతి గురించి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు అది కుల రాజధాని అన్నాడని, కర్నూలు వెళితే తన దృష్టిలో కర్నూల్ రాజధాని అని అన్నాడని పేర్ని నాని గుర్తుచేశారు. వైజాక్ వెళితే లక్ష శాతం రాజధాని అయ్యే లక్షణాలు ఉన్న పట్టణం అని చెప్పాడన్నారు. మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని అంటున్నావు నువ్వు చెడిపోయావ్ కాబట్టి అందరూ చెడిపోవాలని కోరుకుంటున్నావ్ అని అన్నారు. మూడు కాకపోతే ముప్పయ్ పెళ్లికు చేసుకో భరణం ఇస్తున్నావ్..చేసుకుంటున్నావ్ కాకపోతే నీతి సూక్తులు చెప్పేటప్పుడు మనం ఇలాంటి తప్పులు చేయకూడదన్నారు. చాగంటి కోటేశ్వరరావు మాదిరి నీతి సూక్తులు చెప్పకూడదని, గురివింద గింజ కు కిందే నలువు ఉంటుంది కానీ మనకు మొత్తం నలుపే కదా అని పేర్ని తెలిపారు.
కమ్యూనిస్టులూ చెడిపోయారన్న పేర్ని
విపక్షంలోని కమ్యూనిస్టు నాయకులందరూ ఒకప్పుడు అమరావతి లో రాజధాని పనికిరాదని, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని అమరావతి తీర్మానంపై పేర్ని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులు కూడా ఇంత చెడిపోతారని అనుకోలేదన్నారు. వీరందరూ చంద్రబాబుకు అమ్ముడుపోయారా లేదా కుల రాజకీయాలు చేస్తున్నారని అనాలా అని అడిగారు. ఇప్పటికైనా నిబద్దతో, నీతితో కూడిన రాజకీయాలు చేస్తే శత్రువులు కూడా హర్షిస్తారన్నారు. మీ కార్యకర్తలే సిగ్గుపడే విధంగా ఎప్పుడు ఎవరి మాట భుజాన్న వేసుకుంటాడో, ఎవరిని నెత్తిన పెట్టుకుంటాడో తెలియని పరిస్థితని కమ్యూనిస్టులు, పవన్ బంధంపై పేర్ని తెలిపారు. రాజకీయాల్లో విలువలు, నిబద్ధత లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ కు గుర్తింపు వచ్చిందన్నారు.