ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు లేచే పరిస్థితి లేదు; బాబుతో ఇదే ఖర్మ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు యాత్ర చేస్తుంటే, చంద్రబాబు నినాదాన్ని తిరిగి ఆయన పైన ప్రయోగించటం కోసం వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇక వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు.

జనం మాత్రం బాబుతో ఇదే ఖర్మ అనుకుంటున్నారు: పేర్ని నాని
తాజాగా తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రామోజీరావు ఎన్ని జాకీలు పెట్టి చంద్రబాబుని పైకి లేపినా చంద్రబాబు పైకి లేచే పరిస్థితి లేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇక చంద్రబాబు తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెబుతున్నారని, జనం మాత్రం బాబుతో ఇదే ఖర్మ అని చెప్పుకుంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

ధరల గురించి చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్
నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, నిత్యావసర ధరలు పెరగడాన్ని కూడా వైసీపీ ప్రభుత్వం పై రుద్దుతున్న చంద్రబాబు హెరిటేజ్ లో పాలు, పెరుగు ధరలు ఎలా ఉన్నాయో చెప్పాలన్నారు . అంతేకాదు చంద్రబాబుకు బాకా ఊగుతున్న కొందరు విక్రయిస్తున్న ఫుడ్ ప్రొడక్ట్స్ , వంటనూనెల రేట్లు ఎంత ఉన్నాయో చెప్పాలన్నారు. బయట ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతుంది వాళ్లేనని పేర్ని నాని విమర్శించారు.

తిరగబడి బాదేవరకు చంద్రబాబు ఇలాగే మాట్లాడతారు
చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఏపీ వాళ్ళు చాలామంది ఉన్నారు అని, నిత్యావసర వస్తువుల రేట్లు అక్కడైనా.. ఇక్కడైనా.. ఎక్కడైనా ఒకే విధంగా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. జనం అమాయకులని చంద్రబాబు అనుకుని ఏవేవో చెబుతున్నారని పేర్కొన్న పేర్నినాని, కాంతారావు.. రాజనాల సినిమాలలోని డైలాగులు ఇప్పుడు చెబితే జనం నమ్ముతారా చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరగబడి బాదే వరకు చంద్రబాబు ఇలాగే మాట్లాడతారని పేర్ని నాని పేర్కొన్నారు.

మొన్నటిదాకా సంక్షేమ పథకాలపై ఏడ్చిన బాబు
నిన్నటివరకు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారని, చంద్రబాబుతో ఇదే ఖర్మ అంటూ పేర్ని నాని విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని మొన్నటి దాకా బోరుమని ఏడ్చిన చంద్రబాబు, ఇప్పుడు అంతకు మించిన సంక్షేమ అందిస్తామని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పవన్, చంద్రబాబులకు జగన్ సత్తా తెలిసొచ్చింది
2024 తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ లాగా మానసికంగా కుంగి పోవాల్సిందేనని పేర్ని నాని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబు ని చూస్తే జాలేస్తుంది అని పేర్ని నాని స్పష్టం చేశారు. జగన్ సత్తా ఏంటో వారిద్దరికీ ఇప్పుడు తెలిసొచ్చిందని పేర్కొన్న పేర్నినాని చంద్రబాబు చేసిన పాపాలకు అంతే లేదని పేర్కొన్నారు. అధికారం కోసం చంద్రబాబు తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్ని నాని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications