IPC section 188: ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా: బీ అలర్ట్: దానికి సిద్ధపడాల్సిందే
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వెళ్లే వారికి షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఏపీ, తెలంగాణల్లో రోజూ వేల సంఖ్యలో ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ను జారీ చేసింది. ఢిల్లీలో కరోనా కేసులను నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది. ఢిల్లీకి బయలుదేరి వెళ్లదలిచిన వారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో లేక.. అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఎస్ఓపీలకు కట్టుబడి ఉండటమో ఎంతమాత్రం తప్పదు.
ఏపీ, తెలంగాణల్లో రోజువారీ పాజిటివ్ కేసుల వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న విషయం తెలిసిందే. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో వాటి సంఖ్య తక్కువే అయినప్పటికీ.. తీవ్రత, మారణాల్లో పెద్దగా మార్పు ఉండట్లేదు. గురువారం నాటి బులెటిన్ ప్రకారం తెలంగాణలో 6,026 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 52 మంది మరణించారు. అదే ఏపీలో రోజువారీ పాజిటివ్ కేసులు 21,954గా రికార్డయింది. 72 మంది కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు.
ఈ పరిణామాలు ఢిల్లీ సర్కార్ను ఉలికిపడేలా చేశాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరు ఢిల్లీకి వచ్చినా.. వారిని క్వారంటైన్ చేయాలని నిర్ణయించింది. 14 రోజుల పాటు క్వారంటైన్ తప్పదని తెలిపింది. ఏపీ, తెలంగాణల నుంచి వచ్చిన వారిని.. ప్రభుత్వం నిర్వహించే ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకటించింది. ప్రయాణికులు తమ వెంట ఆర్టీపీసీఆర్ నెగెటివ్ టెస్ట్ రిపోర్టులు తెచ్చుకున్నప్పటికీ- వాటిని పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. 14 రోజుల పాటు ప్రభుత్వ క్వారంటైన్ తప్పదని పేర్కొంది. ఈ మేరకు ఎస్ఓపీలను జారీ చేసింది.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇండియన్ పీనల్ కోడ్లోని సెక్షన్ 188, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంలోని సెక్షన్లు 51,60 కింద కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ప్రభుత్వాల తరఫున, అధికారిక పనుల నిమిత్తం వచ్చిన వారికి మినహాయింపు ఇస్తున్నట్లు డీడీఎంఏ తెలిపింది. అయినప్పటికీ- కోవిడ్ మార్గదర్శకాలు, ప్రొటోకాల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. విమానాలు, రైళ్లు, బస్సులు, ఏ ఇతర వాహనాల ద్వారా ఢిల్లీకి వచ్చినప్పటికీ క్వారంటైన్ తప్పదని స్పష్టం చేసింది. వారిని గుర్తించడానికి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వేస్టేషన్లు, ఢిల్లీ సరిహద్దుల్లో ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.