స్నేక్ గ్యాంగ్: నోటికి నల్లగుడ్డ, సీతక్క ఆగ్రహం(పిక్చర్స్)
హైదరాబాద్: రాజధాని హైదరాబాదులోని ఓల్డ్ సిటీలో స్నేక్ గ్యాంగ్ ఉదంతం పైన సీబీఐ విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది.
స్నేక్ గ్యాంగ్ ఆగడాలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు.
బీజేపీ నగర అధ్యక్షులు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీ అండదండలతోనే స్నేక్ గ్యాంగ్ ఆకృత్యాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
మహిళా మోర్చా
నోటికి నల్ల గుడ్డ కట్టుకొని ట్యాంక్ బండ్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న బీజేపీ మహిళా మోర్చా నాయకులు.
మహిళా మోర్చా
మజ్లిస్కు రాష్ట్ర ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తున్న కారణంగా ఈ దారుణాల పైన సీబీఐ విచారణ అనివార్యమన్నారు. స్థానిక పోలీసులు అధికారులు, సిబ్బంది మొత్తాన్ని బదలీ చేయాలని లేదంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశముందన్నారు.
సీతక్క
అరాచకశక్తులకు, మహిళలపై అఘాయిత్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారటం బాధాకరమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. నగరంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డ స్నేక్ గ్యాంగ్ను, సహకరించిన పోలీసు అధికారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గురువారం ఆమె ఎన్టీఆర్భవన్లో మీడియాతో మాట్లాడారు.
స్నేక్ గ్యాంగ్
కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 80 నిర్ణయాలు తీసుకున్నా ఒక్కటి కూడా అమలు కాలేదని సీతక్క అన్నారు. ‘యాక్టివ్ పోలీస్.. పాస్ట్ యాక్షన్'లా పోలీసులు ఉండాలన్నారు. అంతే కానీ పోలీసులకు అందంగా డ్రెస్లు వేసి, బైక్లిచ్చి ఆర్భాటాలు చేస్తున్న కేసీఆర్ వాళ్లను షో కేసులో పెట్టుకునే విధంగా తయారు చేస్తున్నారన్నారు.
స్నేక్ గ్యాంగ్
హైదరాబాద్ను సింగపూర్లా చేస్తానని చెబుతున్న కేసీఆర్ ‘రేపిస్ట్ నగరం' కాకుండా చూడాలన్నారు. పరిశ్రమల కోసం వెంపర్లాడుతున్న కేసీఆర్ రైతుల కష్టాలను పట్టించుకోవడం లేదన్నారు. బంగారు తెలంగాణ తన కలగా చెబుతున్న కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చేసుకున్నారని ఎద్దేవా చేశారు.