ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న నారా లోకేష్, అందుకే నాడు డుమ్మా
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మెడ నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. దీంతో గత రెండు రోజులుగా ఆయన ఫిజియోథెరఫీ చేయించుకుంటున్నారు.య గత పది రోజుల నుంచి ఆయన మెడనొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది.
ఈ కారణంగానే ఈ నెలలో కెఎల్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్ షాపులో ఆయన తొలి రెండు రోజులు హాజరు కాలేదని, ఆ తర్వాత మూడో రోజు మాత్రమే హాజరయ్యారని చెబుతున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలోనే ఆయన ఫిజియోథెరఫీ చేయించుకున్నారు.
గురువారం నాడు కూడా విజయవాడలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఫిజియోథెరఫీ చేయించుకున్నారు. అనంతరం గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరఫీ చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
చంద్రబాబును కలిసిన హరీశ్ పర్వతనేని
ఏపీ సీఎం చంద్రబాబును వియత్నాంలో భారత రాయబారి హరీశ్ పర్వతనేని శుక్రవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వియత్నాం-భారత్ మధ్య మంచి సంబంధాలున్నాయన్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వియత్నాం పర్యటనకు వచ్చినప్పుడు భారత రాయబారులు వారి సొంత రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రధాని సూచనతోనే తాను చంద్రబాబు వద్దకు వచ్చానని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, సముద్ర ఉత్పత్తుల రంగాల్లో అభివృద్ధిపై వియత్నాం నుంచి తగిన సహకారం ఉండేలా తనవంతు చొరవ చూపుతానన్నారు.