ఐదుగురు దొంగల పట్టివేత: వారి శైలే వేరు (పిక్చర్స్)
హైదరాబాద్: సికింద్రాబాద్, హైదరాబాదు జంటనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నేరాలకు పాల్పడుతున్న ఐదుగురు ఘరానా నేరస్థులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ శుక్రవారం మీడియా సమావేశంలో ప్రవేశపెట్టి, వివరాలను వెల్లడించారు.
ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేసే ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన సయ్యద్ హమీద్ అలియాస్ అహ్మద్ (33), గుంటూరు జిల్లాకు చెందిన చెరుకుమల్లి కోటేశ్వరరావు (33), గొలుసు చోరీల్లో ఆరితేరిన కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మహ్మద్ ఖళీల్ అలియాస్ గోరే (23), మెదక్ జిల్లా రామాయంపేట వాసి ఒరదరాజు అలియాస్ జ్ఞానప్రకాష్ (38), అనంతపురం జిల్లా కలిగిరికి చెందన కర్రావుల శ్రీనివాస రెడ్డి (22)లను వేర్వేరుగా పట్టుకున్నట్లు ఆనంద్ చెప్పారు.
వీరు యాభై ఇళ్లలో దొంగతనాలు చేశారని, 26 గొలుసు చేరీలకు పాల్పడ్డారని, వాహనాల అపహరణకు పాల్పడ్డారని విచారణలో తేలింది. నిందితుల నుంచి రూ. 65 లక్షల విలువైన 1.8 కిలోల బంగారం ఆభరణాలను, 3.2 కిలోల వెండి సామగ్రిని, ద్విచక్రవాహనాలను, ల్యాప్టాప్లను ఫోన్లను, డైమండ్ రిస్ట్వాచీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఐదుగురి పట్టివేత
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు ఘరానా దొంగలను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు.

తాళాలు పగులగొట్టడంలో..
పట్టుబడిన దొంగల్లో హమీద్, కోటేశ్వర రావు ఇనుపరాడ్లతో ఇళ్ల తాళాలు పగులగొట్టడంతో పాటు కిటికీలను తొలగించి చోరీలు చేయడంలో నేర్పరులని ఆనంద్ చెప్పారు.

నలబై ఆరు దొంగతనాలు..
హమీ, కోటేశ్వర రావు హైదరాబాదులోని మీర్పేట, చందానగర్, రాయదుర్గం, నాచారం, హయత్నగర్, వనస్థలిపురం, మల్కాజిగిరి, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం ఠాణాల పరిధుల్లో 46 దొంగతనాలు చేశారు. వీరిద్దరిపై ఆయా పోలీసు స్టేషన్లలో నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగులో ఉన్నాయి.

గతంలో కూడా..
హమీద్ను గతంలో సైబరాబాద్, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహరాష్ట్ర పోలీసులు, కోటేశ్వర రావును విజయవాడ, నరసరావుపేట పోలీసులు అరెస్టు చేశారు.

పాత నేరస్తులే...
పాత నేరస్థులైన ఖలీల్, ఒరదరాజు, గతంలో 26 గొలుసు చోరీలు, నాలుగు ఇళ్లలో దొంగతనాలు, రెండు వాహనాల చోరీలకు పాల్పడ్డారు.

పలు పోలీసు స్టేషన్ల పరిధుల్లో..
ఖలీల్, ఒరదరాజు జంట కమిషనరేట్లలోని మల్కాజిగిరి, ఉప్పల్, మీర్పేట, ఆల్వాల్, తిరుమలగిరి, మహంకాళి పోలీసు స్టేషన్ల పరిధుల్లో నేరాలు చేశారు.

మెడలో గొలుసులను...
ద్విచక్రవాహనంపై వెళ్తూ మహిళల మెడల్లోని ఆభరణాలను లాక్కుని పారిపోవడంలో ఖలీల్, ఒరదరాజులు ఆరితేరినవారు.

హత్య కేసుల్లోనూ...
ఖలీల్, ఒరదరాజులకు నేరెడుమెట్, మల్కాజిగిరి ఠాణాల్లో జరిగిన రెండు హత్య కేసులతోనూ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వీరిపై ఎనిమిది నాన్ బెయిలబుల్ వారంట్లు పెండింగులో ఉన్నాయి.












Click it and Unblock the Notifications