రాహుల్తో జగన్ కుమ్మక్కు: గాలి, రఘువీరా కౌంటర్, వెంకయ్యపై విహెచ్
హైదరాబాద్/ అనంతపురం/ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్), కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలది ఒకే మాట ఒకే బాట అని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడ వైయస్ జగన్ కుమ్మక్కై అనంతపురంలో యాత్రలకు సిద్ధమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రాహుల్ యాత్రను వైసీపీ సమర్థిస్తుందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీపర్యటించనున్నారని ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. బుధవారం రాహుల్ పాదయాత్ర చేయనున్న గ్రామాలైన నల్లమాడ నుంచి ఓడిచేర్వు వరకు క్షేత్రస్థాయిలో రఘువీరా పర్యటించారు. ఈనెల 24న రాహుల్ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట మార్చారని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యడు వి.హనుమంతరావు విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎంలు, కేంద్రమంత్రులు రాజీనామా చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.
బీజేపీ 14 నెలల పాలనలో అన్ని రకాలుగా విఫలమయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీకీ ప్రత్యేక హోదా కోసం నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ, జేడీ శీలం ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.