శిశువును ఆమె ఇలా కిడ్నాప్ చేసింది: బాబును కలిసిన తల్లి (పిక్చర్స్)
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రి నుంచి శిశువును ఓ మహిళ అపహరించిన ఉదంతం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తనకు బిడ్డ పుట్టాడని భర్తను నమ్మించడానికి ఆమె శిశువును కిడ్నాప్ చేసింది. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
మాయమైన శిశువును తమకు అప్పగించడంతో తల్లిదండ్రుల సంతోషం పట్టనలవి కాకుండా ఉంది. శిశువు తల్లి, తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో తల్లి ఐతా శ్రీదేవి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపింది.
శ్రీదేవి బిడ్డకు ముఖ్యమంత్రి పాతిక వేల రూపాయలు మంజూరు చేశారు. ఆ శిశువు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తన బిడ్డ తనకు దక్కడానికి శ్రద్ధ తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు కూడా శ్రీదేవి ధన్యవాదాలు తెలిపింది.
రికార్డు అసిస్టెంట్ను కలిసింది...
మహిళ మల్లీశ్వరి ఈ నెల 14వ తేదీ ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చి రికార్డు అసిస్టెంట్ శ్రీనును కలిసింది. శ్రీను సహాయంతో శిశువును ప్రసవించిన తల్లి వివరాలను తెలుసుకుంది.
శ్రీను సహకారంతో...
శ్రీను సహకారంతో మల్లీశ్వరి సెక్యూరిటీ గార్డులు ముఖర్జీ, కన్నయ్యలను దాటుకుని శ్రీనుతో కలిసి పసి పిల్లలను ఉంచే ఎస్ఎన్సియు వార్డులోని స్టెప్ డౌన్ బ్లాకులోకి ప్రవేశించింది.
శ్రీను చూపించాడు..
స్టెప్ డౌన్ బ్లాక్ కార్నర్లో ఉన్న ఐతా శ్రీదేవి అనే మహిళ ఐదు రోజుల పసిబిడ్డను చూపించి ఆ బిడ్డను తీసుకుని వెళ్లాలని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత పదిన్నర, పదకొండు గంటల మధ్య నాగమల్లేశ్వరి శ్రీను చూపించిన మగశిశువును అపహరించకుని వెళ్లింది.
ఆస్పత్రి నుంచి ఇలా...
పాత ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నాగమల్లేశ్వరి బయటకు వచ్చి ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి తెనాలి వెళ్లి తన భర్తతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.
శిశువు అపహరణ కేసులో ఐదుగురి అరెస్టు
శిశువు అపహరణ కేసులో పోలీసులు నాగమల్లేశ్వరితో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. సెక్యూరిటీ గార్డులతో పాటు శ్రీను, నాగమల్లేశ్వరి భర్తను పోలీసులు అరెస్టు చేశారు.
వాట్సప్లో చూసి గుర్తించింది...
ఐతా శ్రీదేవి వాట్సప్లో తనకు పంపిన ఫొటోను చూసి తన బిడ్డను గుర్తు పట్టింది. దాంతో పోలీసులు నాగమల్లేశ్వరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రిని కలిసి...
తన శిశువు తనకు దక్కిన నేపథ్యంలో శిశువు తల్లి ఐతా శ్రీదేవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబ నాయుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
సిఎం ఉదారత...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీదేవి బిడ్డకు ఆర్థిక సాయం అందించారు. పాతిక వేల రూపాయలు బిడ్డ పేర బ్యాంకులో డిపాజిట్ చేయిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు కమిషనర్ వెల్లడి...
ప్రభుత్వాస్పత్రి నుంచి శిశువు అపహరణకు గురైన విధానాన్ని విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ మీడియా ప్రతినిధులకు వివరించారు.