రాజధాని: అటు ఆందోళనలు, ఇటు హ్యాపీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిని విజయవాడ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటించగానే రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలోనూ నిరసన ప్రదర్శనలు ఎగిసిపడ్డాయి. విద్యార్థులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు రోడ్లపైకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతపురంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఎస్కేయూ విద్యార్థులు రోడ్లపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. సిఆర్ఐటి విద్యాసంస్థల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు నగరంలోని టవర్క్లాక్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. వీరంతా మానవహారంగా ఏర్పడి రాజధానిగా విజయవాడ వద్దు.. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థి, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నగరంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి.
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుచేయాలంటూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. వివిధ విద్యార్థి, యువజన సంఘాలు బంద్ నిర్వహించాయి. రాజధాని నగరాన్ని ప్రకటించే ముందు అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని కోరినా మొండిగా వ్యవహరించారని ముఖ్యమంత్రి తీరుపై వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కూడా ఆందోళనలకు మద్దతు ఇచ్చాయి.
రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తిరుపతిలో రాయలసీమ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఎస్వీ యూనివర్శిటీలో బంద్ పాటించారు. ర్యాలీగా బయల్దేరి యూనివర్శిటీ ముందు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. నెల్లూరు జిల్లాను రాజధానిగా చేయాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నెల్లూరులో గురువారం ఆందోళన చేశారు. స్థానిక విఆర్సి కూడలిలో టైర్లు కాల్చి నిరసన తెలిపారు.
భగ్గుమన్న కర్నూలు
కర్నూలు జిల్లాలో విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. జిల్లాలోని అన్ని కోర్టుల్లో న్యాయవాదులు విధులు బహిష్కరించి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఆందోళకారుల అరెస్టు
విద్యార్థి ఐకాస నాయకుడు నరసింహయాదవ్ నేతృత్వంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాజ్విహార్ సెంటర్లో ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్స్టేషన్కు తరలించారు.
మిన్నంటిన ఆందోళనలు
శాసనసభలో ముఖ్యమంత్రి కర్నూలు జిల్లాకు ప్రకటించిన పథకాలేవీ విద్యార్థులు, యువత ఆశలను తీర్చేవి కావని అన్నారు. న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు.
బెజవాడలో సంబరాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటనతో విజయవాడలో సంబరాలు మిన్నంటాయి. బాణసంచా పేల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
స్వీట్లు పంచుకున్నారు...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని ప్రకటనలో విజయవాడ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. టిడిపి కార్యకర్తలు స్వీట్లు తినిపించుకున్నారు.
రెపరెపలాడిన టిడిపి జెండా
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో రాజధాని ప్రకటన చేయగానే విజయవాడలో టిడిపి కార్యకర్తలు ఉత్సాహంతో వీధుల్లోకి వచ్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు.