సివిల్స్ 3వ, ర్యాంకర్ గోపాలకృష్ణపై హైకోర్టులో పిల్, ఎందుకంటే?
సివిల్ సర్వీసెస్ -2016 లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయన తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని, దీనిపై విచారణ జరపాలంటూ హైకో
హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ -2016 లో మూడో ర్యాంక్ సాధించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన రోణంకి గోపాలకృష్ణకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయన తప్పుడు ధృవీకరణ పత్రం సమర్పించి రిజర్వేషన్ పొందాడని, దీనిపై విచారణ జరపాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
యూపీఎస్ సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ -2016 లో గోపాలకృష్ణకు సివిల్స్ లో మూడో ర్యాంకు వచ్చింది. అయితే అతడికి ఈ ర్యాంకు కేటాయించడం చట్టవిరుద్దంగా ప్రకటించి, అతను సమర్పించిన అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో సికింద్రాబాద్ ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన న్యాయవాది ఎం. మురళీకృష్ణ పిల్ దాఖలు చేశారు.
ఇందులో కేంద్ర వ్యక్తిగత శిక్షణశాఖ కార్యదర్శి, యూపీఎస్ సీ జాయింట్ సెక్రటరీ , ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రోణంకి గోపాలకృష్ణను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం నాడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయనుంది.
గత ఏడాది మే 31వ, తేదిన యూపీఎస్ సి 2016 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో గోపాలకృష్ణకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంకు వచ్చింది. అయితే గోపాలకృష్ణకు ఎలాంటి అంగవైకల్యం లేకున్నా ఆ కోటా కింద తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి పరీక్షకు హజరయ్యారని వివరించారు. ఓబీసీ అయిన గోపాలకృష్ణ ఆర్థోపెడిక్ విభాగంలో 45 శాతం మేర అంగవైకల్యం ఉన్నట్టు ధృవీకరణ పత్రంసమర్పించి పరీక్షకు హజరయ్యారని వివరించారు.
వికలాంగ కోటా కింద అర్హత మార్కులు 75.34 తో అతను మెయిన్ పరీక్షకు అర్హత సాధించారని చెప్పారు. ఓబీసీ కేటగిరిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెయిన్స్ కు అర్హత సాధించలేదన్నారు. మెయిన్స్ లో సాధారణ అభ్యర్థులకు పరీక్షా సమయం 3 గంటలైతే, వికలాంగులకు 4 గంటలన్నారు. దీని ద్వారా కూడ గోపాలకృష్ణ లబ్దిపొందారన్నారు.
గోపాలకృష్ణది పెద్ద వైకల్యమే కాదన్నారు. గోపాలకృష్ణ అంగవైకల్యం పై విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అంతేకాదు అతనికి ఐఎఎస్ సర్వీస్ కేటాయించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.