APలో ముంచుకొస్తున్న 'ముందస్తు'? PK టీం సలహా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికలతోపాటు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. అయితే ప్రభుత్వం ఇటీవల చేపడుతున్న కార్యక్రమాలు, అధికారుల నియామకాలు, బదిలీలు ముందస్తు ఊహాగానాలకు ఊతమిచ్చేలా ఉన్నాయి. దీనిలో భాగంగానే సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ముఖ్యమంత్రి జగన్ పిలుపునిచ్చారు.
ముందస్తుతో ప్రతిపక్షాలకు చెక్?
ప్రతిపక్షాల పొత్తు రాజకీయాలకు చెక్ పెట్టాలంటే ముందస్తుకు వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకొని వస్తాయనేది వైసీపీ యోచనగా ఉంది. ఇటీవల ప్రధానమంత్రితో సమావేశం తర్వాత పవన్ కల్యాణ్ వైఖరి టీడీపీతో పొత్తుండదనే సంకేతాలిచ్చినట్లుగా భావిస్తున్నారు. జనసేన విడిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీ గెలవగలుగుతుంది. అయితే చివరి నిముషంలోనైనా వారిద్దరి మధ్య పొత్తు కుదురుతుందని వైసీపీ భావిస్తోంది. దీన్ని ఎదుర్కోవడానికి ముద్రగడ పద్మనాభం, గంటా శ్రీనివాసరావులాంటివారి పార్టీలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి
పోలింగ్ రోజు కలిసి రానున్న అధికార యంత్రాంగం
ప్రభుత్వం అధికారులను కీలకమైన పోస్టుల్లో నియమిస్తోంది. పోలింగ్ జరిగేరోజు ఈ యంత్రాంగం తనకు కలిసివస్తుందని సీఎం భావిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారని విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు. షెడ్యూల్ కంటే ముందుగానే ముందస్తుకు వస్తారని, వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్ కూడా తన పథకాల్లో వేగం పెంచిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలను ఆకట్టుకునేందుకు మూడురాజధానులకు కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
వ్యతిరేకత వ్యక్తమవుతున్న ఎమ్మెల్యేల జాబితా సిద్ధం?
ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మరోసారి గెలవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ టీం సలహా ఇచ్చినట్లు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరించిన విధానాన్నే అవలంబించాలనే యోచనలో జగన్ ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై ప్రశాంత్ కిషోర్ టీం సర్వే మొదలుపెట్టింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వల్ల ఎమ్మెల్యేలపై ప్రజలకు సదభిప్రాయం ఉందా? లేదా? అనేది పీకే టీం తెలుసుకోగలుగుతోంది. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో నిరసనలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల జాబితాలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.