నవంబర్లో ఏపీకి మోడీ-భోగాపురం ఎయిర్ పోర్టు శంఖుస్ధాపన-ఏర్పాట్లపై బొత్స సమీక్ష
విజయనగరం: నవంబర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ప్రధాని చేతుల మీదుగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు శంకుస్థాపన చేయించేందుకు వైసీపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ, నిర్వాసితుల పునరావాసం త్వరగా పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ అధికారులను ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టుల భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు.
భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై కోర్టు కేసులు, ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలపై మంత్రి బొత్స జిల్లా అధికారులతో చర్చించారు. ఎయిర్ పోర్టు టెర్మినల్ భవనాలు, అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ముందుగా జి.ఎం.ఆర్. సంస్థకు ఇచ్చే విషయంపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఆ సంస్థకు ఇచ్చిన కమిట్మెంట్ మేరకు భూములు ముందుగా అందజేయాలని పేర్కొన్నారు. నిర్వాసిత కాలనీల్లో ఇళ్ళ నిర్మాణం, రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసిత కాలనీ ల నిర్మాణంలో నిధుల విడుదల సమస్య ఏర్పడకుండా చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేసారు. ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. నిర్వాసితుల ఇళ్ళ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. కాలనీల నిర్మాణంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామన్నారు.
అలాగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపైనా మంత్రి అధికారులతో సమీక్షించారు. డి.పట్టా భూములు, జిరాయితీ భూములు, ఎలాంటి పట్టా లేకుండా ఇతరుల స్వాధీనంలో వున్న భూములకు సంబంధించి వచ్చే సమావేశం నాటికి పూర్తి సమాచారంతో రావాలని మంత్రి సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రాంతానికి చెందిన గ్రామ సర్పంచ్ తో మంత్రి మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటవుతున్నందున ఆ ప్రాంత రైతులు, ప్రజలు,ప్రజా ప్రతినిధులు భూసేకరణలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత అభివృద్ధికి దోహదం చేస్తుందని ఈ అవకాశం విడిచిపెట్టకుండా ఆలోచించాలని సూచించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రతిపాదించిన స్థలంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం వెంటనే ప్రతిపాదనలు రుపొందిచాలని ఇ.పి.డి.సి.ఎల్. అధికారులను మంత్రి ఆదేశించారు. జాతీయ రహదారి నుంచి గిరిజన విశ్వవిద్యాలయం వరకు నాలుగు వరసల రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించి అందజేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారులని మంత్రి ఆదేశించారు.