మోడీ ఫోన్, బయటకు వచ్చి మాట్లాడిన చంద్రబాబు: జపాన్ టూర్కు
హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఫోన్ చేశారు. ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుండగా.. ప్రధాని నుండి ఫోన్ కాల్ రావడంతో చంద్రబాబు సమావేశం హాలు నుండి బయటకు వచ్చారు. ఫోన్ మాట్లాడాక తిరిగి కేబినెట్ హాలుకు వెళ్లారు.
తన జపాన్ పర్యటనను ప్రధాని మోడీకి తెలియజేయడం, పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేసేందుకు రావాలని కోరేందుకు అంతకుముందే చంద్రబాబు ప్రధానికి ఫోన్ చేశారు. అప్పుడు ఆయన బిజీగా ఉన్నారు. దీంతో ఆ తర్వాత ప్రధాని మోడీ ఏపీ సీఎంకు ఫోన్ చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారన్నారు.
పార్లమెంట్ ఆవరణలో మణ్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం త్వరలో ఏర్పాటు చేయించనున్నామని చంద్రబాబు తెలిపారు. శనివారం అల్లూరి సీతారామరాజు 118 జయంతిని పురస్కరించుకుని ట్యాంక్బండ్పైన ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాంజలి సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.
విశాఖపట్నంలో అల్లూరి పేరిట గిరిజన విశ్వవిద్యాలయాయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రూ.20కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మించేందుకు నిర్ణయించామన్నారు.
ఇదిలా ఉండగా.. చంద్రబాబు శనివారం అర్ధరాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అమరావతి శంకుస్థాపనకు జపాన్ ప్రధానిని ఆహ్వానిస్తారు. చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు తదితరులు ఉన్నారు.