జగన్ పథకం- మోడీ కాపీ- చేసేదేదో సక్రమంగా చేయమంటున్న కేజ్రివాల్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని విధంగా ఓ అరుదైన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు పట్టించుకోని ఓ వ్యవహారాన్ని ఆర్ధిక భారాన్ని సైతం లెక్కచేయకుండా అమలు చేస్తోంది. ఇప్పుడు మూడేళ్ల తర్వాత అదే పథకాన్ని కేంద్రంలో మోడీ సర్కార్ కాపీ చేసేసింది. దేశవ్యాప్తంగా తాము కూడా దీన్ని అమలు చేస్తామని ముందుకొచ్చింది. అయితే అరకొరగా చేసేందుకు మాత్రమే సిద్ధమైంది. దీంతో ఢిల్లీ సీఎం కేజ్రివాల్ మోడీకి దీనిపై అక్షింతలు వేస్తూ లేఖ రాశారు.
వైఎస్ జగన్ నాడు-నేడు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖల్ని మార్చేందుకు వీలుగా నాడు-నేడు పథకాన్ని అమలు చేస్తోంది. అక్కడక్కడా కొన్ని లోపాలున్నా స్ధూలంగా ఈ పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారిపోతున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లేక విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లను వదిలి ప్రైవేటు వైపు మొగ్గుచూపుతున్న తరుణంలో తిరిగి వాటిలో సౌకర్యాలు కల్పించడం ద్వారా విద్యార్ధుల్ని తిరిగి వాటికి రప్పించేందుకు ఇది ఉపయోగపడుతోంది. దీంతో నాడు-నేడు పథకంపై దేశంలోని పలు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని కేజ్రివాల్ సర్కార్ స్ఫూర్తితోనే ఈ పథకం అమలవుతుండటం విశేషం.
పీఎం శ్రీగా అమలుకు మోడీ రెడీ
ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ సర్కార్ తో పాటు ఏపీలో వైసీపీ సర్కార్ కూడా విజయవంతంగా అమలు చేస్తున్న నాడు-నేడు పథకాన్ని కాపీ చేసి కేంద్ర ప్రభుత్వం తాజాగా పీఎం శ్రీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. నిన్న కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 14,500 స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కేంద్రం సిద్ధమైంది. అయితే వచ్చే ఐదేళ్లలో ఈ లక్ష్యం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అక్కడే విమర్శలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం ఇరుకునపడింది.
కేజ్రివాల్ కీలక సూచన
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రాష్ట్రాల్లోని 14500 స్కూళ్లను మాత్రమే పీఎం శ్రీ పథకం కింద బాగు చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మండిపడ్డారు. ఇలా కేవలం 14500 స్కూళ్లను ఐదేళ్లలో బాగుచేస్తే దేశవ్యాప్తంగా ఉన్న 10 లక్షల స్కూళ్లు రిపేర్లు చేయించాలంటే ఎన్నేళ్లు పడుతుందంటూ ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలా కాకుండా ఒకేసారి 10 లక్షల స్కూళ్లను ఈ పథకం కింద రిపేర్లు చేయించాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. అంతే కాదు ట్విట్టర్ లోనూ ఇదే విషయాన్ని షేర్ చేశారు. పద్నాలుగున్నర వేలే కాదు దేశంలోని మొత్తం 10 లక్షల ప్రభుత్వ పాఠశాలలను బాగుచేయాలని ప్రధానికి లేఖ రాశాను. మేము దీన్ని 5 సంవత్సరాలలో చేయగలము. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను వెంట తీసుకెళ్లండి, మీకు పూర్తి సహకారం అందిస్తామన్నారు.