ఏపీలో మద్దతు ఎవరికో తేల్చేసిన ప్రధాని మోదీ - పార్టీ నేతలకు కొత్త రూట్ మ్యాప్..!!
ఏపీలో ప్రధాని మోదీ పర్యటన వేళ..రాజకీయంగా కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ చేరుకున్న ప్రధాని జనసేన అధినేత పవన్ తో సమావేశమయ్యారు. పార్టీ ఏపీ కోర్ కమిటీ తో ప్రధాని కీలక అంశాలు చర్చించారు. ఆ సమయంలో అనేక అంశాల పైన ప్రధాని స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీలో పార్టీ పరిస్థితి బాగోలేదని వ్యాఖ్యానించారు. గతంలో గుజరాత్.. కర్ణాటక..ఏపీలో పార్టీ పరిస్థితి ఒకే విధంగా ఉండేదని, ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని ప్రధాని గుర్తు చేసినట్లు సమాచారం.
వైసీపీ ప్రభుత్వానికి మద్దతుపై క్లారిటీ
అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి తమ మద్దతుకు సంబంధించి ప్రధాని కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఫెడరల్ స్పూర్తితో కేంద్రం - రాష్ట్ర సంబంధాలు వేరు, అదే సమయంలో రాజకీయం వేరని ప్రధాని తేల్చి చెప్పారు. రాజకీయంగా బలోపేతం కావటం పైన ఏపీ బీజేపీ నేతలు ఫోకస్ చేయాలని ప్రధాని ఆదేశించారు. అందుకోసం స్థానికంగా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లో నిలదీయాలని నిర్దేశించారు. ఇప్పటి వరకు అలా చేయద్దని ఎవరైనా చెప్పారా అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వానికి తన మద్దతు ఉందని ఏపీ ప్రజలు నమ్ముతున్నారంటూ బీజేపీ నేత ప్రస్తావించనగా.. తాను సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే కట్టుబడతానని ప్రధాని స్పష్టం చేసారు. అంతకు మించి ఎవరిపైనా ప్రత్యేక ప్రేమ చూపనని ప్రధాని తేల్చి చెప్పారు.

మీరు చేయాల్సింది మీరు చేయండి
వాళ్లు చెప్పేది వాళ్లు చెప్పుకొంటారని... మీరు చేయాల్సింది మీరు చేయండంటూ పార్టీ నేతలకు సూచించారు. ఏపీ ప్రభుత్వ తీరు పైన పార్టీ నేతలు వివరించే ప్రయత్నం చేసారు. వైసీపీ ప్రభుత్వం అప్పులు - భూ కబ్జాలు తప్ప రాష్ట్రం కోసం చేసింది ఏమీ లేదని పార్టీ నేతలు పురందేశ్వరి, సత్య కుమార్, మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి, సీఎం రమేశ్, సుజనా చౌదరి తదితరులు మోదీ దృష్టికి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితిని బయట పెట్టాలి కదా అంటూ ప్రధాని పార్టీ నేతలను ప్రశ్నించారు. ఏపీలో పార్టీ బలోపేతం పైన ప్రధాని కీలక మార్గనిర్దేశం చేసారు. ఏపీలో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. ఏపీపై సీరియ్సగా దృష్టి పెడతామని... పూర్తిస్థాయి ఇన్చార్జిని నియమిస్తామని మోదీ చెప్పారు. యువతను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
ఏపీ బీజేపీకి కొత్త ఇంఛార్జ్
ఇందు కోసం కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడా పోటీలు నిర్వహించాలన్నారు. ఏపీకి ఇచ్చిన ఎయిమ్స్, గ్రామాలకు ఇచ్చిన కొళాయి కనెక్షన్లు, రైతుల ఖాతాల్లో వేసిన పీఎం కిసాన్ సొమ్ము, హౌసింగ్ ద్వారా ఇచ్చిన ఇళ్ల గురించి చెబితే ఫలితం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పది విషయాల్లో విఫలమైతే... కనీసం నాలుగింటినైనా బలంగా ప్రజల్లోకి తీసుకెళితే ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని సూచించారు. మహిళా మోర్చా తరఫున వీధుల్లోకి వెళ్లి మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల ఇళ్ల నుంచి వాళ్ల పిల్లల దుస్తులు సేకరించి అంగన్వాడీ సెంటర్లలో ఇస్తే బీజేపీ అంటే రాజకీయం, ఓట్లు మాత్రమే కాదు.. సేవ కూడా అనే భావన ప్రజల్లో పెరుగుతుందని ప్రధాని మోదీ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ బలోపేతం కోసం పని చేయాల్సిందేనని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications