ఏపీ పై ప్రధాని మోదీ గురి - టార్గెట్ వైసీపీ: పార్టీ నేతలతో భేటీ - 28న విజయవాడలో బహిరంగ సభ..!!
ఏపీ పైన బీజేపీ కొత్త లెక్కలు వేస్తోంది. తిరుపతిలో గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన..రాష్ట్ర పార్టీ నేతలకు దిశా నిర్దేశం తరువాత పార్టీ వ్యూహాల్లో మార్పులకు కనిపిస్తున్నాయి. ఇక, ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీ ఏపీ - తెలంగాణ రాజకీయాల పైన గురి పెట్టారు. చాలా కాలం తరువాత ప్రధాని మోదీ ఏపీ..తెలంగాణ..కర్ణాటక కు చెందిన ఎంపీలతో పాటుగా మూడు రాష్ట్రాల బీజేపీ నేతలను ఈ రోజు అల్పాహార విందుకు ఆహ్వానించారు. ఆ సమయంలో రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి.. బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల పైన చర్చించనున్నట్లు సమాచారం.

ఏపీ - తెలంగాణ నేతలకు ప్రధాని ఆహ్వానం
కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండటంతో.. ఏపీ - తెలంగాణలో రాజకీయ పరిస్థితుల పైన చర్చించనున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు..తెలంగాణలో తాజాగా కేసీఆర్ నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకొని వేస్తున్న అడుగుల పైన ఎంపీలు ప్రధానికి వివరించే అవకాశం ఉంది. ఇక, ప్రధాని ఏ రకంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ ముఖ్యనేతలు ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురళీధరన్ నివాసంలో భేటీ అయ్యారు. ప్రధాని వద్ద ఏ అంశాలను ప్రస్తావించాలనే దాని పైన చర్చించారు.

ఏపీలో బీజేపీ బహిరంగ సభ
వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 28న విజయవాడలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్ణయాల పైన ఈ సభ ద్వారా తాము గట్టిగా పోరాటానికి సిద్దమయ్యామనే సంకేతాలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశానికి కేంద్ర ప్రముఖుల్లో ఎవరిని ఆహ్వానించాలనే దాని పైన చర్చ సాగింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, యూపి సీఎం యోగిని పిలవాలని భావించారు. అయితే, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల సన్నాహాల్లో యూపీ సీఎం బిజీగా ఉండటంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ ను పిలవాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

టార్గెట్ జగన్ - కేసీఆర్
అదే విధంగా బీజేపీ తెలంగాణ నేతలు ప్రధానితో భేటీ తరువాత కేంద్ర హోం మంత్రితోనూ సమావేవం కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరి బియ్యం అంశం లో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని లక్ష్యం చేసుకొని చేస్తున్న విమర్శలు.. అదే సమయంలో కేసీఆర్ రాజకీయంగా ఇతర పార్టీల నేతలతో సమావేశాలపైనా చర్చించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ - బీజేపీ ఇతర పార్టీలతో తమ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం అవుతారని ఇప్పటికే టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ స్పష్టం చేసారు.

తెలుగు రాష్టాల్లో బీజేపీ కొత్త వ్యూహాలు
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు గంట సేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాల పైన ఇద్దరు సీఎంలు చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతున్నా.. .స్టీల్ ప్లాంట్ వ్యవహారం లో పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలు పోరాటానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ పరిస్థితుల్లో పొత్తు కొనసాగిస్తూనే.. సొంతంగా తమ బలం చాటుకొనే ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రంలో అవసరమైన సమయాల్లో వైసీపీ మద్దతిస్తున్న వేళ.. ఇప్పుడు ఏపీలో వైసీపీ లక్ష్యంగా బీజేపీ రాజకీయ పోరాటానికి సిద్దం అవుతుండటంతో..ఇక, ఏపీ రాజకీయాలు కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు ప్రధానితో జరిగే సమావేశం లో బీజేపీ వ్యూహాల పైన స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications