టీడీపీ పతనం ఖాయం: మళ్లీ తెలుగులో ట్వీటిన మోడీ!
అమరావతి/హైదరాబాద్: దక్షిణాది కీలకమైన రెండు తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయడానికి భారతీయ జనతాపార్టీ పెద్ద కసరత్తే చేస్తోంది. వరుసపెట్టి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు. కొద్దిరోజుల కిందటే మహబూబ్ నగర్, కర్నూలుల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న మోడీ.. మరోసారి తెలుగు రాష్ట్రాల గడప తొక్కబోతున్నారు. మరికొన్ని గంటల్లో ఆయన తెలంగాణలోని సికింద్రాబాద్, ఏపీలోని రాజమహేంద్రవరంలల్లో పర్యటించబోతున్నారు. ఈ రెండు చోట్లా బీజేపీ రాష్ట్రశాఖ నిర్వహించబోయే బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
మోడీ! దమ్ముంటే చర్చకు రాః దీదీ సవాల్..మోడీ-షా శని వదులుతుందిః చంద్రబాబు
సికింద్రాబాద్.. నా మనసుకు నచ్చిన ప్రదేశం
తాను తెలుగు రాష్ట్రాల పర్యటనకు రానున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మోడీ. ఈ విషయాన్ని ఆయన తెలుగులోనే రాసుకొచ్చారు. సంపన్నమైన భారత దేశాన్ని మరింత సుసంపన్నంగా మర్చడంలో సికింద్రాబాద్ చిరస్మరణీయ పాత్ర పోషించిందని మోడీ చెప్పారు. తెలంగాణ ప్రజలు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్నవారని అన్నారు. తెలుగు ప్రజలతో ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉన్నామని చెప్పారు. మినీ భారత్ గా పిలుచుకునే హైదరాబాద్, సికింద్రాబాద్ లల్లో పర్యటించడానికి ఎప్పుడు వచ్చినా.. అది తనకు ఆనందాన్ని కలిగించే విషయమేనని అన్నారు. సికింద్రాబాద్ ప్రజలను తాను సోమవారం సాయంత్రం మరోసారి కలుసుకోబోతున్నానని చెప్పారు. దీనికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని చెప్పారు.
ఏపీ.. టీడీపీ పతనం ఖాయం
సికింద్రాబాద్ తరువాత ఏపీలో రాజమహేంద్రవరంలో పర్యటించబోతున్నట్లు నరేంద్రమోడీ వెల్లడించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఏపీలో రెండోసారి అడుగు పెట్టబోతున్నానని చెప్పారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పతనం ఖాయమని తాను విశ్వసిస్తున్నానని అన్నారు. టీడీపీ ఓడిపోతుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. ఏపీ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. టీడీపీ పాలన పూర్తిగా అవినీతిమయమైందని విమర్శించారు. కుటుంబ రాజకీయాలకు కేంద్రబిందువైందని అన్నారు.
ఏపీకి వరుస కట్టిన జాతీయ నేతలు..
ఇదిలావుండగా.. ఏపీకి జాతీయ స్థాయి నాయకులు వరుస కట్టారు. కిందటి నెల 29వ తేదీన నరేంద్రమోడీ తెలంగాణలోని మహబూబ్ నగర్, ఏపీలోని కర్నూలు జిల్లాల్లో ఆయా రాష్ట్రాల పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ పై, ఏపీలో చంద్రబాబు ప్రభుత్వాన్ని తనదైన శైలిలో తూర్పారబట్టారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి గెలవాల్సిన అవసరంపై ప్రజలకు వివరించారు.
ఏపీలో చంద్రబాబు ఒంటరే అయినా..
బీజేపీ తరఫున మోడీ ఒక్కరే రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుండగా.. ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. 2014 ఎన్నికల్లో నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్ లపై చంద్రబాబు నాయుడు భారం వేశారు. అధికారంలోకి రాగలిగారు. అయిదేళ్లు తిరిగే సరికి.. ఈ ఇద్దర్నీ చంద్రబాబు దూరం చేసుకున్నారు. అంతర్గత కారణాలేమైనప్పటికీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చారు చంద్రబాబు. కాంగ్రెస్ తో జట్టు కట్టారు. జాతీయ స్థాయిలో 21 ప్రతిపక్షాల్లో ఒకటిగా మిగిలిపోయారు. ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోవాల్సి వచ్చినందున.. జాతీయ స్థాయి నాయకులను తన కోసం ప్రచారానికి పిలిపించుకుంటున్నారు.
ఫరూఖ్ అబ్దుల్లాతో మొదలు..
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను తన కోసం రాష్ట్రానికి రప్పించుకున్నారు. పార్టీ తరఫున ప్రచారం చేయించుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న కడప జిల్లాలో పర్యటించగా.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్.. విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. బీజేపీని ఓడించాల్సిన చారిత్రక అవసరం ఉందని పిలుపునిచ్చారు.
త్వరలో మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్ డీ దేవేగౌడ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మంగళ, బుధవారాల్లో ఆయన అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహించే అవకాశం ఉంది. చంద్రబాబుకు మద్దతు పలుకుతున్న తమిళనాడులోని డీఎంకే నేత స్టాలిన్ కూడా ఏపీకి రానున్నట్లు టీడీపీ నాయకులు చెబుతున్నారు. తమిళుల ప్రభావం అధికంగా చిత్తూరు జిల్లాల్లో స్టాలిన్ తమ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, రెండుచోట్ల బహిరంగ సభలను నిర్వహిస్తామని వారు వెల్లడించారు.