ఏపీ ఎన్నికల్లో పబ్లిక్ మూడ్ పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీలో ఎన్నికల సమరం ఉత్కంఠ పెంచుతోంది. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ యుద్దం పతాక స్థాయికి చేరింది. పార్టీల ముఖ్య నేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో మూడు పార్టీల కూటమి లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రజల మూడ్ గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజల్లో తాను గుర్తించిన అంశాలను వెల్లడించారు.
ఏపీలో కొత్త లెక్కలు
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారం పైన భారీ అంచనాలతో ఉన్నాయి. సీఎం జగన్ తిరిగి తనకు అధికారం ఖాయమనే నమ్మకంతో కనిపిస్తున్నారు. మూడు పార్టీల పొత్తు ఖాయమైన తరువాత మార్చి లో ప్రధాని మోదీ చిలకలూరిపేట సభలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ నెల 7,8 తేదీల్లో మరోసారి ప్రధాని రాజంపేట, రాజమండ్రి, అనకాపల్లి, విజయవాడలో ప్రచారంలో పాల్గొంటున్నారు.

తాజాగా టీడీపీ, జనసేన మేనిఫెస్టో విడుదల చేసారు. బీజేపీ మద్దతు ఉందని చెప్పారు. అయితే, ఈ అంశం పైన వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఎన్నికల సమయంలో ఇక్కడ పబ్లిక్ ఏం కోరుకుంటున్నారనే అంశం పైన ప్రధాని మోదీ స్పందించారు.
ప్రజలు కోరుకుంటున్నారు
ఇక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల పైన ప్రధాని మోదీ స్పందించారు. ఏపీ ప్రజల్లో మార్పు మూడ్ కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చిలకలూరిపేట సభలో ఆ విషయాన్ని తాను స్పష్టంగా చూడగలిగానని తెలిపారు. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంతటి భారీ ర్యాలీ జరిగిందని అన్నారు.
కేంద్రంలో ఏపీ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం కోరుకుంటున్నారని స్పష్టం అయిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలా వద్దా అనే అంశం పైనే ప్రజలు తమ అభిప్రాయం వెల్లడించేందుకు సిద్దమైనట్లు తాను గుర్తించానని మోదీ చెప్పుకొచ్చారు. ఏపీలో టీడీపీ, జనసేనతో అక్కడి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చేందుకే కలిసామని మోదీ స్పష్టం చేసారు.
ఎన్డీఏలోకి కేసీఆర్ కు ఎంట్రీ
తెలంగాణలో రాజకీయాలపైన మోదీ స్పందించారు. అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు గోల్డ్ మెడల్, అంతకు ముందున్న బీఆర్ఎస్ సర్కారుకు సిల్వర్ మెడల్ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు.
ఎన్డీఏలోకి బీఆర్ఎస్ చేరికా పైన మోదీ స్పందించారు. గతంలో ఎన్డీఏలో చేరిక పై కేసీఆర్ ముందుకు వస్తే తాము తిరస్కరించామని.. మళ్లీ వచ్చినా అదే ఆన్సర్ అని తేల్చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం మరోసారి రావటం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేసారు. 400 సీట్లు ఖచ్చితంగా సాధిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications