రాజధాని లేకుండా, మోడీ హామీ, 'కలెక్టర్' బ్రిటిష్ది..: బాబు, రెవెన్యూశాఖపై సంచలన వ్యాఖ్య
విజయవాడ: రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా మనలను వెంటాడుతున్నాయని, కేంద్రం రూ.15,500 కోట్ల ఆర్థిక లోటును భరిస్తామని హామీ ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం చెప్పారు. విజయవాడలోని గేట్ వే హోటల్లో ఆయన కలెక్టర్ల సదస్సులో మాట్లాడారు.
రాష్ట్ర అబివృద్ధికి ఏడు మిషన్లు, 5 గ్రిడ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రెండంకెల అభివృద్ధి కష్టం కాదన్నారు. సింగపూర్, టర్కీ, దుబాయ్ దేశాల నుంచి ఎన్నో అనుభవాలను నేర్చుకోవచ్చన్నారు. అభివృద్ధికి రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయని చెప్పారు.
వనరులను సమక్రమంగా వినియోగిస్తే రెండంకెల అభివృద్ధి సాధ్యమేనని చెప్పారు. ప్రపంచంతో పోటీ పడి పని చేస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు. జలవనరుల శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పట్టిసీమ వద్దే ఉండి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తున్నారన్నారు.
ఇది మన ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. అధికారులు వినూత్న పంథాలో కొత్త ఆలోచనలతో పని చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ మిగులు స్థాయికి వచ్చిందన్నారు. పుష్కలంగా విద్యుత్ ఉన్నందున కోతలు లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖల సహకారంతోనే అభివృద్ధి అన్నారు.
కలెక్టర్ బ్రిటిష్ పదం
పాలనలో చాలా మార్పు వచ్చిందని చెప్పారు. కలెక్టర్ అనే పదం బ్రిటిష్ కాలం వాళ్లది అన్నారు. దానిని మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు.
రాజధాని, వసతులు, పరిశ్రమలు లేని రాష్ట్రం వచ్చిందన్నారు. కేంద్రం లోటు భర్తీ చేసేందుకు హామీ ఇచ్చిందన్నారు. పార్లమెంటు హామీలు, విభజన చట్టం హామీలు కేంద్రం నెరవేర్చాలన్నారు. విభజన సమస్యలు వెంటాడుతున్నాయన్నారు. కేంద్రం వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం ఇస్తానని హామీ ఇచ్చిందన్నారు.
రెవెన్యూ శాఖపై బాబు సంచలన వ్యాఖ్య
రెవెన్యూ శాఖ పైన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెవెన్యూ శాఖ అధికారులు మారాల్సి ఉందన్నారు. అధికారులు, ఉద్యోగులు పారదర్శకంగా పని చేస్తూ, లంచాలకు దూరంగా ఉండి, ప్రజలకు దగ్గర కావాలన్నారు.
రెవెన్యూ శాఖ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిలో రాష్టం రెండంకెల వృద్ధిని సాధించాలని తాను కోరుతుంటే కొన్ని ప్రభుత్వ శాఖలు అవినీతిలో రెండంకెల వృద్ధిన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖపై ఉన్న అవినీతి ముద్ర తొలగించుకోవాలన్నారు.
రెవెన్యూ శాఖ అవినీతి ముద్రను వదిలించుకోవాలని, ఈ శాఖలో అవినీతి అలాగే ఉందన్నారు. అవినీతి కంటే అసమర్థతే చాలా ప్రమాదం అన్నారు. టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇసుక మాఫియాను అరికట్టలేకపోతున్నారన్నారు. ఇసుక నిల్వలు ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తేలేకపోతున్నామన్నారు.
అధికారులే ప్రజల వద్దకు వెళ్లి అభిప్రాయాలను తెలుసుకోవాలని, పారిశ్రామిక వృద్ధిలో ఏపీని ఐదో స్థానంలో నిలపాలన్నదే తన తక్షణ లక్ష్యమన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని, రుణమాఫీ సక్రమంగా జరుగుతున్నా, కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు.