మోడీ వైజాగ్ టూర్ జగన్ పై ఒత్తిడి పెంచుతోందా ? ప్రధాని మెండిచేయి చూపిస్తే ? విపక్షాలు మాత్రం !
ప్రధాని మోడీ ఇవాళ విశాఖ రానున్నారు. రేపు మధ్యాహ్నం వరకూ ప్రధాని విశాఖలోనే ఉంటారు. కానీ సీఎం జగన్ ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం లేదు. రేపు ఏయూలో జరిగే బహిరంగసభలో మాత్రమే ప్రధానితో కలిసి ఆయన పాల్గొంటారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మినహా విపక్షాలకు చోటులేకుండా పోయింది. అయితే ప్రధానితో కలిసి బహిరంగసభలో పాల్గొనబోతున్న సీఎం జగన్ పై మాత్రం పలు అంశాలు ఒత్తిడి పెంచుతున్నాయి.

మోడీ వైజాగ్ టూర్
వైజాగ్ లో మోడీ రోజున్నర పర్యటన ఇప్పుడు ఏపీలో రాజకీయ సమీకరణాలపై పెను ప్రభావం చూపేలా కానిపిస్తోంది. గతంలో ప్రధాని మోడీ ఏపీకి వచ్చినప్పుడు కేవలం ఆ కార్యక్రమం వరకూ చూసుకుని వెళ్లిపోయారు. రాజకీయ చర్చలకు దూరంగా ఉన్నారు. కానీ ఈసారి అలా కాదు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనతో సంబంధాలు, స్ధానిక అధికార పార్టీ వైసీపీతో ఉన్న సంబంధాలు, భవిష్యత్తులో పెట్టుకోబోయే పొత్తులు ఇలా పలు అంశాలకు ప్రధాని టూర్ సమాధానం కానుంది. దీంతో మోడీ టూర్ పై రాజకీయ పక్షాల కళ్లన్నీ ఉన్నాయి.

పవన్ మినహా విపక్షాలు దూరం
ప్రధాని మోడీ వైజాగ్ టూర్ అధికారిక పర్యటన కావడంతో ఇందులో విపక్షాలకు చోటు లేకుండా చేసేందుకు అధికార వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మినహా మరో పార్టీ కానీ, నేత కానీ, స్ధానిక ఎమ్మెల్యేలు కానీ ఈ టూర్ లో లేకుండా పోయారు. ప్రోటోకాల్ ను సైతం లెక్కచేయకుండా స్ధానిక ఎమ్మెల్యేలను కూడా ఈ టూర్ కు దూరం చేయడంలో జగన్ సర్కార్ సక్సెస్ అయింది. దీంతో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రధానితో భేటీ కాబోతున్నారు.

అయినా జగన్ పై ఒత్తిడి ?
ప్రధాని మోడీ విశాఖ టూర్ కు విపక్షాల్ని దూరం చేయడంలో సక్సెస్ అయిన సీఎం జగన్ కు ఇతర అంశాల్లో మాత్రం ఒత్తిడి తప్పడం లేదు. ముఖ్యంగా ప్రధాని మోడీ టూర్ తో రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పుకునేందుకు వైసీపీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేసింది. కానీ పరిస్ధితులు మాత్రం అనుకూలించలేదు. దీంతో ప్రధాని మోడీ టూర్ లో జరిగే శంఖుస్ధాపనలు ఇప్పుడు జగన్ సర్కార్ కు సంతోషం మిగల్చడం కంటే ఒత్తిడి పెంచేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న జగన్.. అంతకంటే ముందు కీలక హామీల్ని నెరవేర్చుకునేలా కనిపించడం లేదు.

జగన్ పై ఒత్తిడి పెంచుతున్న అంశాలివే ?
ప్రధాని మోడీ వైజాగ్ టూర్ లో సీఎం జగన్ పై పలు కీలక అంశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందులో ముఖ్యమైనది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దీన్ని ఆపే విషయంలో ప్రధాని నుంచి ఏదో ఒక హామీ తీసుకోలేకపోతే జగన్ కు భవిష్యత్తులో సమస్యలు తప్పకపోవచ్చు. అలాగే విభజన హామీల్లో ఉన్న రైల్వే జోన్ సాధన కోసం ఎన్నిప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఇప్పుడు వైజాగ్ లో ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించకపోతే జగన్ పై మరింత ఒత్తిడి పెరగడం ఖాయం. అలాగే విశాఖ రాజధానికి నిధుల కేటాయింపు విషయంలోనూ ప్రధాని నుంచి ఏదో ఒక హామీ రాబట్టుకుంటే మూడు రాజధానులకు ఆమోదముద్ర పడినట్లు భావించవచ్చు. సాధ్యంకాకపోతే మాత్రం బీజేపీ అమరావతి హామీకే కట్టుబడినట్లు భావించవచ్చు. ఇలా పలు అంశాలు జగన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications