జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్- హైకోర్టు గ్రీన్ సిగ్నల్- మోడీ విశాఖ టూర్ లో అదే కీలకం ?
ఏపీలో ప్రధాని మోడీ త్వరలో పర్యటించబోతున్నారు. ఈ నెల 11న విశాఖ చేరుకోనున్న ప్రధాని మోడీ.. 12వ తేదీన నగరంలో పలు కార్యక్రమాలల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా కీలక ప్రాజెక్టులకు వర్చువల్ గా శంఖుస్ధాపన చేయబోతున్నారు. ఇందులో విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన పలు హామీలు కూడా ఉన్నాయి. దీంతో ఈ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే హైకోర్టు తాజాగా ఇచ్చిన ఓ తీర్పుతో ఈ ప్రాజెక్టుల జాబితాలోకి మరో కీలక ప్రాజెక్టు కూడా వచ్చి చేరబోతోంది.
మోడీ విశాఖ టూర్
ప్రధాని మోడీ ఈ నెల 11,12 తేదీల్లో విశాఖపట్నంలో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో ప్రధాని చేత పలు ప్రాజెక్టులకు శంఖుస్ధాపన చేయించేందుకు వైసీపీ సర్కార్ సిద్దమవుతోంది. దీనికోసం ఇప్పటికే పీఎంవోకు జాబితా పంపడంతో పాటు వాటికి ఆమోదముద్ర కూడా వేయించుకుంది. అయితే ఇంకొన్ని ప్రాజెక్టులకు మాత్రం పీఎంవో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మొత్తం 14 ప్రాజెక్టుల వరకూ శంఖుస్ధాపనలో చేర్చినా వాటిలో 8 ప్రాజెక్టులకు మాత్రమే ప్రధాని కార్యాలయం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మిగతా ప్రాజెక్టులను కూడా ఇందులో చేర్చేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
భోగాపురం ఎయిర్ పోర్టు
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించబోతున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ప్రధాని మోడీ టూర్ లోనే శంఖుస్ధాపన చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో ప్రధాని టూర్ లో ఈ అంశాన్ని చేర్చేందుకు పీఎంవో నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం అత్యవసర విచారణ కోరినట్లు తెలుస్తోంది. దీంతో హైకోర్టు కూడా దీనిపై విచారణ చేపట్టడమే కాకుండా తీర్పు కూడా ప్రకటించింది.
హైకోర్టు గ్రీన్ సిగ్నల్
భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు నిన్న కొట్టేసింది. గతంలో భూసేకరణ కోసం ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం 2700 ఎకరాల భూసేకరణ కోసం ప్రభుత్వం గతంలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో 2200 ఎకరాలు ఎయిర్ పోర్టు కోసం కేటాయించగా, మిగిలిన 500 ఎకరాలు అనుబంధ కార్యకలాపాల కోసం వినియోగించాలని నిర్ణయించారు. ఎయిర్ పోర్టు కోసం సేకరించాల్సిన 2200 ఎకరాల్లో 2064 ఎకరాలు ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మిగిలిన భూముల సేకరణలో ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు హైకోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో వాటి సేకరణ పూర్తి కానుంది.
ప్రధాని మోడీతో శంఖుస్ధాపన ?
భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణలో తలెత్తిన ఇబ్బందులు సమసిపోవడంతో ప్రధాని మోడీ విశాఖ టూర్ లో దీనికి శంఖుస్ధాపన చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాస్తవానికి 2019లోనే అప్పటి సీఎం చంద్రబాబు దీనికి ఓసారి శంఖుస్ధాపన చేశారు. అయితే భూసేకరణ సమస్యలతో పనులు ముందుకు సాగలేదు. హైకోర్టులో పిటిషన్లపై తాజాగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పర్యావరణ సమస్యలపై గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రధాని మోడీతో భోగాపురం ఎయిర్ పోర్టుకు శంఖుస్ధాపన చేయించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రధాని టూర్ షెడ్యూల్లో భోగాపురం ఎయిర్ పోర్టు శంఖుస్ధాపనను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తోంది.