విశాఖలో ప్రధాని రెండు రోజుల టూర్ - సీఎం జగన్ తో కలిసి: ఒక్క సభతో సమాధానం..!!
ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ప్రధాని విశాఖలో పర్యటించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఈ పర్యటనలో ఎంతో కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు నిరీక్షిస్తున్న విశాఖ రైల్వే జోన్ పనులకు ప్రధాని మోదీ సీఎం జగన్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కేంద్రం ఇచ్చిన హామీ..పునర్విభజన చట్టం రూపంలో ఆమోదించినా అనేక కారణాలతో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఫీజబులిటీ లేదంటూ రైల్వే బోర్డు నివేదిక ఇచ్చినట్లుగా వార్తలు రాగా, కేంద్ర రైల్వే మంత్రి ఆ వార్తలను ఖండించారు. ఇప్పుడు ప్రధాని స్వయంగా విశాఖ వస్తున్న వేళ..విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ నెల 11వ తేదీ సాయంత్రం ప్రధాని విశాఖ చేరుకుంటారు. అక్కడే రక్షణ రంగ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకటంతో పాటుగా అక్కడే ఉండనున్నారు. 12వ తేదీ ఏయూ గ్రౌండ్స్ లో సభకు ప్రధాని హాజరవుతారు. అక్కడి నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. దాదాపు రూ 120 కోట్లతో జోన్ కార్యాలయ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేస్తారు. దీని ద్వారా ఇక, జోన్ ఏర్పాటు పైన ఎటువంటి సందేహాలకు తావు లేకుండా ప్రధాని స్పష్టత ఇవ్వనున్నారు. సుమారు రూ 26 వేల కోట్లతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టును సీఎంతో కలిసి ప్రారంభిస్తారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ - సీఎం జగన్ ప్రసంగాలు ఉంటాయి. ఈ సభలో కేంద్రం నుంచి ఏం ఆశిస్తుందీ సీఎం వివరించనున్నారు.
అదే విధంగా ప్రధాని సైతం కేంద్రం ఏపీకి ఏం చేసిందీ..ఏం చేయనుందీ వివిరిస్తారని తెలుస్తోంది. ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఏపీ రాజకీయాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల వ్యవహరం లో భాగంగా విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్ర వైసీపీ మంత్రులు..నేతలు కొత్త వ్యూహాలను తెర మీదకు తెస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సేవ్ విశాఖ పేరుతో కౌంటర్ వ్యూహం అమలు చేస్తోంది. ఇక, ప్రధాని రెండు రోజుల విశాఖ పర్యటన సమయంలో సీఎం జగన్ రాష్ట్రంలోని పరిస్థితులను వివరించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం పైన క్లారిటీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రాజకీయ పొత్తులకు సంబంధించి పార్టీ నేతలతో ప్రధాని సమావేశం సమయంలో స్పష్టమైన సంకేాలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో ప్రధాని రెండు రోజుల విశాఖ పర్యటన ఏపీలో పాలనా .. రాజకీయంగా కీలకంగా మారనుంది.