ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీకి ఛాన్స్ - వైసీపీ హైజాక్..!!
విశాఖ కేంద్రంగా ఆసక్తి కర రాజకీయం. ప్రధాని విశాఖ పర్యటన వేళ బీజేపీ రోడ్ షోలకు ప్రణాళికలు సిద్దం చేసింది. రెండు మార్గాలను ప్రధాని కార్యాలయానికి ప్రతిపాదించింది. నగంలో భారీగా రోడ్ షో నిర్వహించాలని భావిస్తోంది. ప్రధాని అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల పర్యటన కోసం విశాఖ వస్తున్నారు. ఈ నెల 11, 12వ తేదీల్లో ప్రధాని పర్యటన ఖరారైంది. పర్యటనలో భాగంగా విశాఖలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఈ సభ ఏర్పాట్లను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీంతో, సభ నిర్వహణ - ఏర్పాట్లలో బీజేపీకి జోక్యం లేకుండా పోయింది.
పార్టీ పరంగా రోడ్ షో ల నిర్వహణ కోసం ప్రతిపాదనలు పంపారు. ఇదే సమయంలో ఏపీలో పొత్తు రాజకీయాల్లో భాగంగా జనసేన తో పొత్తు కొనసాగుతుందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు చంద్రబాబు కొద్ది రోజులుగా పవన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని రెండు పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా బీజేపీతో దూరం పాటిస్తున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ పైన మాత్రం పవన్ తనకు అభిమానం ఉందని పలు మార్లు చెప్పుకొచ్చారు. ప్రధాని భీమవరం పర్యటన సమయంలో సభకు పవన్ ను ఆహ్వానిస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించినా జనసేనాని హాజరు కాలేదు.
ఇప్పుడు విశాఖలో రెండు రోజులు ప్రధాని ఉండనుండటంతో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రధానితో సమావేశం అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ దిశగా బీజేపీ నేతలు కూడా చొరవ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఇప్పుడు పవన్ ప్రధానిని కలుస్తారా.. ప్రధాని అప్పాయింట్ మెంట్ అడుగుతారా..అడిగితే ప్రధాని ఇస్తారా అనేది ఈ చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో ఇప్పటికే ప్రధాని పర్యటన మొత్తం అధికారిక పర్యటన కావటంతో, ఏపీ ప్రభుత్వ ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటుగా బహిరంగ సభ నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.
బహిరంగ సభ లో ప్రధానితో పాటుగా గవర్నర్, సీఎం జగన్, అధికారులు పాల్గొంటారని తెలుస్తోంది. బీజేపీ నేతలతో మాత్రం ప్రధాని సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పవన్ భేటీ పైన అటు టీడీపీలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. దీంతో..ప్రధాని అధికారిక పర్యటన పైన ఇప్పటికే షెడ్యూల్ రావటంతో..ప్రధాని ప్రయివేటు- పొలిటికల్ అప్పాయింట్ మెంట్స్ పైన స్పష్టత రావాల్సి ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ అంచనాల నడుమ ప్రధాని పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.