ఓ వైపు చంద్రబాబు దీక్ష.. మరో వైపు మోడీ ట్వీట్ ఆసక్తికరం
న్యూఢిల్లీ: కేంద్రం తమ రాష్ట్రానికి అన్యాయం చేసిందంటూ ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తుంటే.. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఏప్రిల్ 20నే చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోడీ ట్వీట్ చేశారు.
'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం జీవించాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నా' అని ప్రధాని నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
చివరి కేంద్ర బడ్జెట్లోనూ తమ రాష్ట్రానికి న్యాయం చేయలేదంటూ ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కూడా బీజేపీతో ఇక పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో 'ధర్మ పోరాట దీక్ష' పేరుతో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ దీక్ష కొనసాగిస్తారు.