విశాఖ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్.. ఇద్దరు కార్మికుల మృతి, బాధిత కుటుంబాల ఆందోళన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ పరవాడలోని ఫార్మాసిటీలో ఓ ఫార్మా కర్మాగారం నుండి విషవాయువులు లీక్ అయిన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందిన విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేసింది. విశాఖ జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఓ ఫార్మా కంపెనీలో పంప్ హౌస్ నుండి రసాయన విషవాయువులు వెలువడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నట్టు తెలుస్తుంది. సమీప పరిశ్రమలలో ఉన్న కార్మికులు కూడా ఈ ఘటనతో ఆందోళన చెందారు.
ఫార్మా సిటీలో గ్యాస్ లీక్ .. ఇద్దరు కార్మికులు మృతి
విశాఖ పరవాడ లోని ఫార్మా సిటీలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు ఒప్పంద కార్మికులు మృతి చెందారు. వ్యర్ధ జలాల పంప్ హౌస్ వాల్ ఓపెన్ చేస్తుండగా ఒక్కసారిగా విషవాయువులు లీకై ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు మృతి చెందారు. మృతులను పాయకరావుపేట కు చెందిన 25 సంవత్సరాల మణికంఠ గా, 25 సంవత్సరాల దుర్గాప్రసాద్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక బాధిత కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని, తమ వారి మృతికి సంస్థ పరిహారం చెల్లించాలని, సంస్థ నిర్లక్ష్యం వల్లే తమ వారు మరణించారని ఫార్మా సంస్థ ముందు ఆందోళన చేస్తున్నారు.
ఫార్మా సిటీ ప్రాంతంలో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం .. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రజల జీవనం
నిత్యం ఏదో ఒక ఘటన చోటు చేసుకోవటంతో విశాఖ ఫార్మాసిటీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఫార్మా కంపెనీల వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలు, సదరు కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. సమీప గ్రామాలలో నీరు కలుషితమవుతుంది.
కాలుష్య కాసారంగా ఆ ప్రాంతమంతా మారుతుంది. అక్కడ గాలిలోనూ విషవాయువులు చేరి గాలి కాలుష్యం అయ్యింది. ఇక ఫార్మా కంపెనీల నుండి విడుదలయ్యే విషవాయువుల వల్ల ప్రజలు అనేక జబ్బుల బారిన పడుతున్నారు. ప్రతిరోజు ఫార్మా కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ పనిచేస్తున్నారు.
గతంలోనూ అనేక మార్లు ఫార్మా సిటీలో గ్యాస్ లీక్ ఘటనలు, ఆందోళనలు
గతంలోనూ అనేక మార్లు ఫార్మా సిటీలోని ఫార్మా కంపెనీలలో గ్యాస్ లీక్ లతో ఇబ్బంది తలెత్తిందని స్థానికంగా ఉన్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషవాయువుల లీకేజ్ జరిగినప్పుడు, ఏదైనా సంఘటన జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ప్రజల నుండి పెద్ద ఎత్తున తమ సమస్యకు పరిష్కారం కావాలన్న డిమాండ్ వినిపిస్తుంది.
గత ఆగస్ట్ నెలలో కూడా ఫార్మా సిటీ కంపెనీలోని రసాయన విషవాయువులు లీకేజీ ఘటనతో తాడి గ్రామస్తులు కంపెనీ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం తమ ప్రాణాలకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు ఎలాంటి ముప్పు వాటిల్లదని చెప్పాలని వారు కోరారు.
Recommended Video
ఫార్మా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తగ్గుతాయంటున్న స్థానికులు
తరచూ జరుగుతున్న ఫార్మా సంస్థలలో గ్యాస్ లీకేజ్ పై తమ ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఫార్మా సిటీలోని కర్మాగార యాజమాన్యాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని మండిపడుతున్న స్థానికులు ఫ్యాక్టరీలు నిబంధనలు పాటించాలని డిమాండ్ చేస్తున్నారు.వ్యర్ధ రసాయనాలను శుద్ధిచేసి సముద్రానికి పంపించాలని, విష వాయువులు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నారు.