15 ఏళ్ల క్రితం చెప్తే నన్ను వెక్కిరించారు, అమ్మో ఎండ! రావొద్దు: బాబు
కడప: పదిహేనేళ్ల క్రితం తాను ఇంకుడు గుంతల గురించి మాట్లాడితే అందరూ ఎగతాళి చేశారని ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం చెప్పారు. ఆయన సోమవారం నాడు కడప జిల్లాలో పర్యటించారు. బల్లిగుట్ట చెరువులో పూడికతీత పనులు పరిశీలించారు. రైతులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కొందరు నేతలకు స్వార్థ ప్రయోజనాలు తప్పితే ప్రజా సంక్షేమం పట్టదన్నారు. గాలేరు - నగరి, హంద్రీనీవా పూర్తి చేసి నీరు అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు నీటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలన్నారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చుకోవాలని సూచించారు.
నీరు చెట్టు కింద కార్యక్రమాలు చేపడుతున్నామని, నీరు చెట్టుతోనే భూగర్భ జలాలు కొంత మేరకు పెరిగాయన్నారు. నీటి సద్వినియోగంపై అందరికీ అవగాహన అవసరమన్నారు. నదుల అనుసంధానంతో భవిష్యత్తులో నీటి కొరత ఉండదని చెప్పారు.
పంట కుంటల తవ్వకం వల్ల రైతులకు నీటి సమస్య ఉండదన్నారు. పంట ఎండిపోకుండా ఉండాలంటే పంట కుంటలు తవ్వాలని చెప్పారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
విభజన వల్ల ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. మేలో వ్యవసాయానికి రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. పింఛన్లు నేరుగా లబ్ధి దారులకు వచ్చేలా చేశామన్నారు.

దేశంలోనే సంక్షేమ రంగాల్లో ఏపీ ఆదర్శంగా ఉందని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఇంకా అభివృద్ధి జరగాలన్నారు. వైద్యశాలల్లో సౌకర్యాలు మెరుగుపడాలన్నారు. వైద్యశాలల్లో అపరిశుభ్రత ఉంటే తాను ఒప్పుకోనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అన్నారు.
పోలవరం త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. వాగులు, వంకల్లో ఆక్రమణలు తొలగాలన్నారు. 2020 నాటికి ఏపీని దేశంలో మూడో స్థానంలో నిలుపుతామని చెప్పారు. ప్రతి గ్రామానికి రెండుసార్లు సంచార వైద్య శాలలు వస్తాయన్నారు. నీటి రక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నాయని, అవసరమైతే తప్ప బయటకు ఎవరూ రావొద్దని కోరుతున్నానని చంద్రబాబు హితవు పలికారు.












Click it and Unblock the Notifications