బాబుకు బంగారు పళ్లెం, షరతు పెట్టా.. నావల్లే: చిరంజీవి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అన్నీ బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించామని రాజ్యసభ సభ్యులు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత చిరంజీవి మంగళవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించే బిల్లును పార్లమెంటు ఆమోదించడం రైతులు సాధించిన విజయమన్నారు. స్వాతంత్య్రం రాకముందు నుండి సీమాంధ్ర ప్రజలు పోలవరం ప్రాజెక్టు గురించి కంటున్న కలలు ఇప్పుడు నెరవేరాయని ఆనందం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్టీలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకించడం సరికాదన్నారు. పార్లమెంటులో మెజారిటీ పార్టీలు ఆమోదించడం వల్లనే ఈ బిల్లు ఆమోదం పొందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా, చట్టబద్ధంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని, ఇందులో ఎలాంటి అన్యాయం, అలసత్వం, ఆలస్యం లేకుండా చూడాలని కోరారు. నిర్వాసితులకు పునరావాసాన్ని కూడా చట్టబద్ధం చేసిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, జైరాం రమేశ్లకు ధన్యవాదాలు తెలిపారు.
నిర్వాసితులకు పునరావాసం దక్కుతుందో లేదో అన్న భయం లేదని, ఈ బిల్లు ద్వారా వారికి ఒక హక్కు కల్పించినట్లు అయ్యిందన్నారు. తెలంగాణ నుంచి బదిలీ అయిన ఏడు మండలాల గిరిజనులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమని, వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా తాను చూస్తానని హామీ ఇచ్చారు.
తాను ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తూర్పు గోదావరి జిల్లా రైతులు తనను కలిసి పోలవరం కోసం పోరాడాల్సిందిగా కోరారని, అప్పట్లో తాను అంతర్వేది నుంచి 20 రోజుల పాటు పోలవరం సాధన యాత్ర చేశానన్నారు. అనంతరం ప్రధాన మంత్రిని కూడా కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చానని, ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు కూడా పోలవరం నిర్మాణాన్ని ఒక షరతుగా పెట్టానని చెప్పారు.
అప్పటి వరకూ పోలవరం అన్నది ఒక ఆకాంక్షగానే ఉందని, దీనిని రాజకీయ పార్టీ అజెండాగా మార్చింది తానేనని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఈ విషయానికి ప్రాధాన్యం ఇచ్చి బిల్లులో పొందు పర్చామని, దీనికి అవసరమైన అన్ని అనుమతులనూ జైరాం రమేశ్ యుద్ధప్రాతిపదికన ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు వ్యవసాయ ఉత్పత్తుల్లో మొదటి రాష్ట్రంగా ఉండేదని, అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిందని గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా విద్యుత్ కొరత కూడా తీరుతుందని, పరిశ్రమలకు నీరు అందుతుందని, మళ్లీ దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలోకి వస్తుందని చిరంజీవి ఆకాంక్షించారు. చంద్రబాబుకి తాము అన్నింటినీ బంగారుపళ్లెంలో పెట్టి అప్పగించామని, ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికపై నిర్మించేలా పర్యవేక్షించాలని అన్నారు.
తెలంగాణలో కూడా రైతులు పడుతున్న కష్టాలను దూరం చేసేందుకు, ప్రజలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం తాము కృషి చేస్తామన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆమోదం పొందడం ప్రజా విజయమన్నారు. ఈ విజయం పార్టీలు, ప్రభుత్వాలు తమకు ఆపాదించుకోవడం తగదన్నారు.