అదే ఏపీలో ప్రతీ ఒక్కరి కల, కేంద్రం ఓకే: చంద్రబాబు, ఐలయ్యపై ఘాటుగా
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి కల పోలవరం ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి కల పోలవరం ప్రాజెక్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని చెప్పారు.
కేంద్రం సానుకూలం
కేంద్రమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం మంగళవారం సీఎం చంద్రబాబునాయడు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కోసం ఖర్చుచేసిన మొత్తాన్ని తిరిగి ఇస్తామని కేంద్రప్రభుత్వం ఒప్పుకుందని చంద్రబాబు తెలిపారు.
సవరించిన అంచనాలు
అలాగే పోలవరానికి సంబంధించి సవరించిన అంచనాలను సమర్పించామని, ప్రాజెక్ట్ కోసం రూ. 12,294.40 కోట్లు ఖర్చు చేశామని ఆయన వివరించారు. ఇంకా 32 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.
రెవెన్యూ లోటు భర్తీకీ ఓకే
తిరుమలలో సేవా టికెట్లపై జీఎస్టీ రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. విభజన తర్వాత ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్రానికి రైల్వే జోన్ కూడా రావాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు.
ఐలయ్యపై ఘాటుగా..
‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' అంటూ ప్రొ. కంచ ఐలయ్య రాసిన వివాదాస్పద పుస్తకంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘ఇది సరైంది కాదు, మంచిది కాదు.. ఎవరూ కూడా ఇటువంటివి ప్రోత్సహించకూడదు.. ఒక కులాన్ని కించపర్చే విధంగా పుస్తకాలు రాసినా, వ్యాఖ్యలు చేసినా మంచిదికాదు. అందరూ సంయమనం పాటించాలి. సమాజంలో విద్వేషాలు కలిగేలా చేయకూడదు' అని వ్యాఖ్యానించారు. ఐలయ్యపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అన్న ప్రశ్నపై చంద్రబాబు స్పందిస్తూ... ‘అటువంటి పుస్తకాలు పబ్లికేషన్ కాకుండా, ఒకవేళ పబ్లికేషన్ అయినప్పటకీ మార్కెట్లోకి వెళ్లకుండా కట్టడి చేయాల్సి ఉంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది' అని వ్యాఖ్యానించారు.