పోలవరం ఎమ్మెల్యే సాహసం...కొండలు, గుట్టలు దాటి .. ఏజెన్సీ ప్రజలకు సాయం..గొడ్డుకారంతో భోజనం
ఏపీలోని ఓ ఎమ్మెల్యే హంగులు ఆర్భాటాలు పక్కన పెట్టారు. తనను నమ్మి ఓట్లేసిన నియోజకవర్గ ప్రజల కోసం ఎంత రిస్క్ అయినా చేస్తానని తేల్చి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తన నియోజకవర్గంలోని మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల ఆకలి తీర్చడం కోసం కొండలు, గుట్టలు దాటి నడిచి వెళ్లారు. వారికోసం నిత్యావసరాలను భుజంపై పెట్టుకుని మోసుకుంటూ ప్రయాణం సాగించారు. తన నియోజకవర్గ ప్రజలైన మారుమూల గిరిజన తండాల వాసులను కలిసి వారికి నిత్యావసరాలు అందజేసి, కరోనాపై అవగాహన కలిగించారు. ఇక అన్నిటికంటే ఓ గిరిజన బిడ్డ ఇంట్లో గొడ్డుకారంతో అన్నం తిని సామాన్యుడిలా ప్రవర్తించారు.

గిరిజనతండాలకు కాలినడకన వెళ్ళి నిత్యావసరాలు అందిస్తున్న ఎమ్మెల్యే
తెలుగురాష్ట్రాల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తమ నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్లి ప్రజల ఆకలి బాధలు తీర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా, కనీసం రోడ్డు రవాణా కూడా సరిగా లేని గిరిజనతండాలకు కాలినడకన బయలు దేరారు. కొండలు, గుట్టలు దాటుకుంటూ ఇప్పటివరకు 56 గిరిజన గ్రామాలలో పర్యటించి 75 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను అందించారు తెల్లం బాలరాజు.

అడవి బిడ్డల ఆకలి తీర్చడానికి అవిశ్రాంతంగా
అడవి బిడ్డల ఆకలి తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ఈ ప్రజా ప్రతినిధి. నిన్నటికి నిన్న బుట్టాయిగూడెం మండలంలోని మారుమూల అటవీ ప్రాంతమైన మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ఇక అక్కడ జీవనం సాగిస్తున్న150 కుటుంబాలకు కావలసిన నిత్యావసర వస్తువులను అందించారు. ఎత్తయిన కొండలు గుట్టలు వాగులు వంకలు దాటుకుంటూ ఐదు కిలోమీటర్ల మేర నడిచి ఆ గ్రామానికి చేరుకున్నారు ఎమ్మెల్యే బాలరాజు.

భుజంపై సరుకుల బస్తాలు మోస్తూ కొండల్లో నడిచిన ఎమ్మెల్యే
మామూలుగా నడవడానికే ఇబ్బంది పడే తరుణంలో భుజంపై నిత్యావసర సరుకుల బస్తాలను మోసుకుంటూ వెళ్లి వారికి నిత్యావసర వస్తువులను అందించారు. కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని వారికి జాగ్రత్తలు చెప్పారు చాలా అధ్వానంగా ఉన్నాయి ఈ మార్గంలో కొంతమేర బైక్ పై, మిగతా దూరమంత కాలినడకన నడచి వెళ్లిన తెల్లం బాలరాజు గిరిజన గూడెంలోనే భోజనం చేశారు. గిరిజన గూడెం లోని ఒక మహిళ గుడిసెలో గొడ్డు కారం వేసుకుని అన్నం తిన్నారు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.

గొడ్డుకారంతో భోజనం చేసిన తెల్లం బాలరాజు
గోగుల కమలమ్మ అనే కొండారెడ్డి గిరిజన మహిళ ఇంట్లో గొడ్డుకారంతో భోజనం చేసిన తెల్లం బాలరాజు కష్ట సమయంలో వారిని ఆదుకోవడం తన బాధ్యత అని చెప్తున్నారు.ఎమ్మెల్యే తమకు కావలసిన నిత్యావసర వస్తువులు తీసుకుని అంతదూరం రావడంతో గిరిజన తండాల వాసులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలినడకన నడచి,బాగా రిస్క్ చేసి నిత్యావసరాలు మోసుకొచ్చిన తమ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ పథకాలు దట్టమైన అడవిలో జీవనం సాగిస్తున్న వారికి కూడా అందుతున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకొని,వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు తెల్లం బాలరాజు.

మారుమూల తండాలకు అండగా ఆదర్శ ఎమ్మెల్యే
ప్రజా ప్రతినిధి అంటే తెల్ల చొక్కా వేసుకొని, హంగులు ఆర్భాటాలతో, 10 మంది అనుచరులతో పబ్లిసిటీ కోసమే పరిమితమయ్యే ఎమ్మెల్యేలు ఉన్న నేటి రోజుల్లో ఈ ఎమ్మెల్యే సాహసం అందరికీ ఆదర్శం. ఇక ఏపీలో తెల్లం బాలరాజు , తెలంగాణ రాష్ట్రంలో కూడా ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్క కరోనా కష్టకాలంలో మారుమూల గిరిజన గ్రామాలకు వెళ్ళి, నిత్యావసరాలు అందించి ప్రజలకు అండగా నిలిచారు. ఇక ఇలాంటి ఎమ్మెల్యేలు ఉంటే ఆయా నియోజకవర్గ ప్రజలకు కష్టాలు కొంతమేరకు తీరినట్లే.












Click it and Unblock the Notifications