పోలవరం పనులు తక్షణమే నిలిపేయండి: తమకు నష్టమంటూ కేంద్రానికి ఒడిశా సీఎం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రైతులపాలిట వరదాయినిగా పేర్కొంటున్న పోలవరం ప్రాజెక్టును మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న ఒడిశా ప్రభుత్వం మరోసారి అడ్డుతగులుతోంది. తాజాగా, పోలవరం పనుల్ని తక్షణమే నిలిపివేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రాన్ని కోరారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఒడిశా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని కేంద్ర పర్యావరణ శాఖమంత్రి హర్షవర్దన్కు లేఖ రాశారు. సమస్యలు పరిష్కారం కాకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఒడిశా ప్రజలు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని సీఎం నవీన్ పట్నాయక్ లేఖలో పేర్కొన్నారు.

ఇదే అంశంపై గతంలో ప్రధాని నరేంద్ర మోడీకి రెండుసార్లు లేఖలు రాశామని, ఒడిశాకు తెలియకుండా ఎలాంటి పనులూ చేపట్టకుండా నిలుపుదల చేయాలని అప్పడు కోరినట్టు చెప్పారు. గోదావరి ట్రిబ్యూనల్ ఆదేశాలను పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. మల్కన్గిరి జిల్లాలో ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదని అన్నారు. పోలవరం డిజైన్ మార్పుపై తమ అభిప్రాయం తీసుకోలేదని సీఎం నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు.
శబరి, సీలేరు నదీ జలాల విషయం పూర్తిగా తేలకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ నిబంధనల్ని అతిక్రమించడమేనని లేఖలో పేర్కొన్నారు. ముంపు , పునరావాసం అంశాలు కూడా ఇంకా తేలలేదని, అవి పరిష్కారమయ్యే వరకు పనులు ఆపాలని ఆయన కేంద్ర పర్యావరణ శాఖకు విన్నవించారు.












Click it and Unblock the Notifications